కరోనా వైరస్ మహమ్మారిగా మరానప్పటికీ... మార్చి వరకు దేశంలో కరోనా వైరస్ కేసులు నమోదు కాకపోవడంతో పెద్దగా మనం పట్టించుకోలేదు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి ఇటీవల తీవ్రమైంది. కానీ మనం ఆలస్యంగా స్పందించడం ఇప్పుడు సమస్యలు సృష్టిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో కోవిడ్-19 నిరోధానికి వ్యాక్సిన్స్ అభివృద్ధి, క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియలోనూ భారత్ భాగస్వామి కానుంది. అయితే, ఇప్పటికే జరగాల్సింది జరిగిపోయింది.
ఆదిలో డబ్ల్యూహెచ్ఓతో కలిసి పనిచేసేందుకు భారత్ స్వచ్ఛందంగా ముందుకు రాలేదు. అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో డబ్ల్యూహెచ్ఓతో కలిసి ముందుకు సాగాలని భారత్ నిర్ణయించింది. అర్జెంటీనా, బహ్రెయిన్, కెనడా, ఫ్రాన్స్, ఇరాన్, నార్వే, దక్షిణ ఆఫ్రికా, స్పెయిన్, స్విట్జర్లాండ్, థాయ్లాండ్ లాంటి దేశాలు ఇప్పటికే ఈ ప్రక్రియలో పొల్గొంటున్నట్టు డబ్ల్యూహెచ్ఓ ధ్రువీకరించింది. తాజాగా కరోనాను నియంత్రించేందుకు మన దేశానికి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు, చికిత్స విధానం గురించి ముమ్మర పరిశోధనలు చేస్తోంది.
కోవిడ్ -19 లాంటి వివిధ వ్యాధుల నిర్ధారణ పరీక్షలకు వినియోగించే కిట్లను అభివృద్ధి చేస్తున్న ఐసీఎంఆర్, త్వరలో వీటిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనుంది. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధి నిర్ధారణ కిట్ల తయారీలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని ఐసీఎంఆర్ వెల్లడించింది. కరోనా వైరస్ సంబంధిత వ్యాక్సిన్లు, నిర్ధారణ పరీక్షలు, చికిత్స విధానాలపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సైతం పరిశోధనలు నిర్వహిస్తోంది. మానవులపై క్లినికల్ ట్రయల్ దశకోసం ఐసీఎంఆర్ ఎదురుచూస్తోంది.వ్యాక్సిన్ రూపకల్పనపై వివిధ పరిశోధనా బృందాల ప్రయత్నాలను తాము గమనిస్తున్నామని, కనీసం ఐదు దేశాలు ఇప్పటికే జంతువులపై క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది. కాగా, త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయని ఐసీఎంఆర్ వర్గాలు చెప్తున్నాయి.