సరిగ్గా రాత్రి 8గంటలకు పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ సంచలన ప్రకటన.. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధిస్తూ సరిగ్గా రాత్రి 8గంటలకు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ.. కరోనా కట్టడికి రెండోసారి కూడా రాత్రి 8గంటలకు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు..! అత్యంత కీలక ప్రటనలు రాత్రి 8గంటలకే చేశారు.. అదేమిటీ.. ప్రధాని మోడీకి, రాత్రి 8గంటలకు ఏదైనా ప్రత్యేకమైన సంబంధం ఉందా..? ప్రతీ సంచలన ప్రకటనను రాత్రి 8గంటలకే ఎందుకు చేస్తున్నారు..? ప్రధాని మోడీకి నంబర్ 8పై ఏదైనా సెంటిమెంట్ ఉందా..? ఆయన మూఢనమ్మకాలను నమ్ముతున్నారా..? అందుకే ఆయన ప్రతిసారి రాత్రి 8గంటలకే మాట్లాడుతున్నారా..? ఇలా అనేక ప్రశ్నలు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి.. ఇక సోషల్ మీడియాలో కూడా ఇదే విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై పలువురు విశ్లేషకులు మాత్రం అత్యంత ఆసక్తికరమైన విషయాలను చెబుతున్నారు.
నిజానికి.. మొన్నటి వరకూ ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు.. కానీ.. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేవలం ఐదురోజుల వ్యవధిలో ప్రధాని మోడీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇక అదికూడా ప్రతిసారి రాత్రి 8గంటల సమయంలోనే.. దీంతో అసలు మోడీ రాత్రి 8గంటలకే ఎందుకు మాట్లాడుతున్నారు..? అత్యంత కీలకమైన ప్రకటనలను ఎందుకు చేస్తున్నారు..? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వీటికి సమాధానంగా అనేక ఊహాగానాలు వస్తున్నాయి. కానీ.. రాత్రి 8గంటలకే ప్రసంగించడంలో శాస్త్రీయమైన విషయం దాగి ఉందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఆ సమయానికే కీలక ప్రకటనలు చేయడంలో ఎంతో అర్థం ఉందని, అందులో ఎలాంటి మూఢనమ్మకాలు లేవని, అది జనం నాడితో కూడుకున్న విషయమని సూచిస్తున్నారు. అదేమిటో ఎలాగో ఇప్పుడు చూద్దాం..
నిజానికి.. రాత్రి 8గంటలు.. జనం ఎక్కువగా టీవీలు చూసే సమయం. దీనిని అందుకే ప్రైమ్ టైం అని అంటారు. ఒకవేళ రాత్రి 7గంటలకే ప్రసంగిస్తే గ్రామాల్లో జనం టీవీల ముందు ఉంటారుగానీ.. పట్టణాలు, నగరాల్లో మాత్రం అప్పటికీ ఇంకా ఇంటికి చేరుకోరు. ఒకవేళ రాత్రి 9గంటలకు మాట్లాడితే గ్రామాల్లో ప్రజలు అప్పటికే నిద్రపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అటు గ్రామాలు, ఇటు నగరాల ప్రజలు ఎక్కువగా టీవీల ముందు ఉండే సమయం రాత్రి 8గంటలు. అందుకే ప్రతీకీలక ప్రకటనను ప్రధాని మోడీ రాత్రి 8గంటల సమయంలోనే చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో పెద్దనోట్ల రద్దును, జనతా కర్ఫ్యూను, దేశవ్యాప్త లాక్డౌన్ను ప్రధాని మోడీ రాత్రి 8గంటలకు ప్రకటించారని అంటున్నారు. అంతేగాకుండా.. ప్రజలను బాగా ఆకట్టుకుంటూ మాట్లాడడంలో ప్రధాని మోడీది ప్రత్యేకమైన శైలి. ఏ సమయంలో మాట్లాడితే జనం వింటారో, జనాన్ని బాగా ఆకట్టుకోవడానికి ఎలాంటి హావభావాలు పలికించాలో మోడీకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.