ఇది నిజంగా శుభవార్తే.. మనందరం ఊపిరిపీల్చుకునే విషయమే.. భారత్లో కరోనా వైరస్ బాధితులు త్వరగా కోలుకుంటున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో సుమారు పదిశాతం మంది అంటే 94 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడ రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించడం, వారిలో మానసిక స్థైర్యం నిపండం వల్లే కోలుకునే వారి శాతం ఎక్కువగా ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే మిగతా దేశాలతో పోల్చితే.. భారత్లో కోలుకుంటున్న వారి శాతం చాలా ఆశాజనకంగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మన దేశంలో ఆదివారం ఉదయం నాటికి 974 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య 27కు చేరకుంది. దేశంలో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14వరకు లాక్డౌన్ విధించింది. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. దాదాపుగా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. నిత్యావసరాలు, అత్యవసర పరిస్థితుల్లో మాత్ర బయటకు వస్తున్నారు. అదికూడా ఇంటికి ఒక్కరుచొప్పునే బయటకు వస్తున్నారు.
అంతేగాకుండా.. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. నిరంతరం పరిశుభ్రంగా ఉండేలా చూసుకుంటున్నారు. గతంలో పోల్చితే ప్రస్తుతం ఇది చాలా మంచి పరిణామమని, కరోనా కట్టడికి ప్రజల్లో వచ్చిన చైతన్యమనే చెప్పొచ్చు. కూరగాయలు కొనేందుకు వెళ్లినా, ఇతర సరుకులు కొనేందుకు షాపులకు వెళ్లినా సామాజిక దూరం పాటిస్తున్నారు. అందరూ దూరందూరంగా క్యూలో నిలబడుతున్నారు. ఇలా.. దేశంలో కరోనా వ్యాప్తిని కొంతమేరకు నియంత్రించగలుగుతున్నామని విశ్లేషకులు చెబుతున్నారు. అయినా.. మున్ముందు చాలా కఠిన పరిస్థితులు ఉన్నాయని, మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. భారతీయుల్లో కరోనా వైరస్పై భయాందోళనకంటే.. దాని బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ఎక్కువగా ఉందని అంటున్నారు.
ఇదే సమయంలో భారతీయ జీవన విధానం కూడా కరోనా కట్టడికి చాలా వరకు దోహదపడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా.. కరోనా వైరస్కు విరుగుడును అంటే వ్యాక్సిన్ను కనిపెట్టే పనిలో కూడా పలువురు భారతీయ పరిశోధకులు నిమగ్నమయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ సీమమిశ్రా, బెంగళూరుకు చెందిన మరొకరు.. కరోనావైరస్కు విరుగుడును కనిపెట్టేందుకు పరిశోధనలు చేస్తున్నారు. అయితే.. వారి పరిశోధనలు కూడా కొంతమేరకు సానుకూల దిశగా సాగుతున్నాయి. వారి కృషి ఫలిస్తే.. ప్రపంచాన్ని కరోనా బారి నుంచి కాపాడిన చరిత్ర భారతీయులకే దక్కుతుందని విశ్లేషకులు అంటున్నారు.