వివాహేతర సంబంధం వల్ల ఒక నిండు ప్రాణం బలిఅయింది. ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టింది. కట్టుకున్న భర్తే తన సర్వస్వం అనుకుంది. కానీ ఆ యువతీ ఆశలన్ని ఆవిరి అయిపోయాయి. కట్టుకున్న భర్తే తనని మోసం చేసాడని తెలియడంతో అయోమయంలో పడింది. అటు కన్నవాళ్ళకి చెప్పలేక, ఇటు కట్టుకున్న భర్త కి తన ఆవేదన చెప్పలేక ఒక బాధాకరమైన నిర్ణయం తీసుకుంది. చావే తనకి శరణం అనుకుందేమో పాపం ఆత్మహత్య చేసుకుని తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయింది.
అసలు వివరాలలోకి వెళితే.. ఈ బాధాకరమైన ఘటన కర్ణాటకలోని మైసూరులో జరిగింది.మైసూరులోని టీకే లేఔట్లో బసవరాజ్కు లేఖన(25) అనే యువతితో ఏడాది క్రితం వివాహమైంది. ఇద్దరూ ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని కాపురం ఉంటున్నారు. కొన్నాళ్ల పాటు వీళ్ళ సంసారం బాగానే సాగింది. కానీ వీళ్ళ జీవితంలోకి అనుకోకుండా ఒక మహిళ ప్రవేశించింది. లేఖన భర్త ఒక ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు.
అయితే బసవరాజ్ తన కంటే వయస్సులో పెద్దదైన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.ఉద్యోగం నెపంతో ఎక్కువ సమయం ప్రియురాలితో బయటే గడిపేవాడు. భార్యను పట్టించుకోవడం మానేసాడు. భర్తమీద అనుమానంతో ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. భర్త వ్యవహారం గురించి తెలుసుకున్న లేఖన తనకు ఎందుకు అన్యాయం చేస్తున్నావని నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన అతడు తన ఇష్టం వచ్చినట్లు ఉంటానని, నీతో కాపురం చేయాలంటే అధిక కట్నం తీసుకురా.. అంటూ లేఖను వేధించాడు.భర్త నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో లేఖన పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు దంపతులిద్దరినీ పిలిచి కౌన్సెలింగ్ కూడా ఇచ్చి పంపించారట. తర్వాత అయిన భర్త ప్రవర్తన మారుతుందేమో అనుకున్నది లేఖన. కానీ బసవరాజ్ పద్ధతి మార్చుకోకుండా ప్రియురాలితో తిరుగుతుండటంతో లేఖన తట్టుకోలేకపోయింది.
భర్త లో మార్పు రావడంలేదని గ్రహించి, జరిగిన సంఘటనలు అన్ని గుర్తుచేసుకుని, భర్త లేని సమయంలో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బసవరాజ్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఒక మహిళ చావుకి ఇంకో మహిళ కారణం అవ్వడం అంటే ఇదేనేమో.