భారత్లో కరోనా భయాందోళనలను కొనసాగుతున్నాయి. దేశంలోని పరిస్థితులు దారిలో పెట్టేందుకు కేంద్రం లాక్డౌన్ విధించింది. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మన్ కీ బాత్ సందేశం ఇస్తూ...లాక్డౌన్ కారణంగా పేదప్రజలకు కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరుతున్నానన్నారు. అయితే, ప్రజలను ఉద్దేశించి ప్రధాని క్షమాపణలు చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు కరోనా విస్తరించే అవకాశాలు ఉన్నాయా అనేది ఆలోచిస్తే...కళ్లముందు ఆందోళనకర పరిస్థితి కనిపిస్తోంది.
జీవనోపాధి కోసం రాష్ట్రాలను దాటిన వారితో కరోనా వైరస్ విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన ప్రజలు దేశ రాజధాని ఢిల్లీలో ఉపాధి పొందుతున్నారు. లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో జనం భారీ సంఖ్యలో స్వగ్రామాలకు దారితీశారు. ఆగ్రా, అలీఘడ్, లక్నో, కాన్పూర్, బీహార్ వెళ్లాల్సిన వారు దాదాపు వంద కిలోమీటర్ల దూరం కాలిబాటన నడిచేందుకు కొందరు సాహసం చేస్తున్నారు. లక్షలాది సంఖ్యలో ఉన్న వలస కూలీలను తరలించేందుకు ప్రభుత్వం సుమారు వెయ్యి బస్సులు ఏర్పాటు చేసింది. అయినా ఆ ఏర్పాట్లు మాత్రం సరిపోవడం లేదు.
ఇదిలాఉంటే, వీరంతా తమ వెంట కరోనాను తీసుకువెళ్తున్నారేమో అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఇంత సంఖ్యలో తరలివెళ్తున్న ఈ కూలీలు వైరస్ను తమ ఊళ్లకు మోసుకువెళ్తే పరిస్థితి ఏంటి. వారిని ఐసోలేట్ చేసేది ఎవరు. వారికి చికిత్సను అందించేది ఎవరు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో పరిష్కార మార్గాలను సైతం పలువురు ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రజలంతా ఊళ్లకు చేరకముందే.. వైరస్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి ఐసోలేషన్ సెంటర్లు విరివిగా ఏర్పాటు చేయాలి. లేదంటే గ్రామాల్లోకి కరోనా వెళ్తే, ఇక అక్కడ ఆ మహమ్మారిని అదుపు చేయడం కష్టంగా మారుతుందని అంటున్నారు. ప్రతి రాష్ట్రం తన సరిహద్దు వద్ద .. ఇలా వలస వస్తున్న వారిని పరీక్షించాల్సి ఉంటుంది. ప్రజలంతా ఊళ్లకు చేరకముందే.. వైరస్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలని సూచిస్తున్నారు.