ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. మహమ్మారిగా మారిన కరోనా విషయంలో ప్రధాని తీరును కేసీఆర్ బహిరంగంగానే కీర్తించారు. ప్రపంచవ్యాప్తంగా సైతం భారత్ను పొగుడుతున్నారని ప్రశంసించారు. కరోనాపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70కి చేరిందని, మరో 11 మంది కూడా చికిత్స తీసుకుని కోలుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మార్చి 30 నుంచి క్వారంటైన్ గడువు పూర్తి చేసుకుని ఆరోగ్యంగా ఉన్నవారినందరినీ డిశ్చార్జ్ చేస్తామని సీఎం పేర్కొన్నారు. ఏప్రిల్ 7లోగా కరోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీరును ఈ సందర్భంగా తెలంగాణ కేసీఆర్ అభినందించారు. కేంద్రం విధించిన లాక్డౌన్పై భారత్ను ప్రపంచ దేశాలు ప్రశంసించాయని కేసీఆర్ పేర్కొన్నారు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, తక్కువ ఆరోగ్య మౌళిక సదుపాయాలు ఉన్న దేశాల్లో వ్యాధి నివారణకు వైద్య సేవల కంటే ముందుగా తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని దీనికి లాక్డౌన్ ఉత్తమ మార్గమని వివిధ దేశాల మెడికల్ జర్నల్స్ పేర్కొన్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టకుండానే ప్రశంసించారు.
కాగా, ఇదిలాఉండగా, క్వారంటైన్లో ఉన్న 27వేల 937 మందిపై నిఘా ఉందని కేసీఆర్ తెలిపారు. వీరిలో 11 మంది కోలుకున్నారని..వారిని సోమవారం డిశ్చార్జ్ చేస్తారని ప్రకటించారు. గాంధీ వైద్యులు అందించిన ధైర్యంతోనే కోలుకున్నానని కోలుకున్న వ్యక్తి చెప్పాడన్న సీఎం కేసీఆర్ మిగిలిన 58 మందిలో కూడా పరీక్షలు నిర్వహించి తగ్గినవారిని క్రమంగా పంపిస్తామన్నారు. కరోనా వచ్చిన 76 ఏళ్ల వ్యక్తికి ఇతర జబ్బులు కూడా ఉన్నాయని ఆయన ఒక్కడు తప్పించి మిగతా వాళ్లంతా ఆరోగ్యంగానే ఉన్నారు. పంపించే ముందు పక్కాగా పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేసుకుంటామన్నారు.