మానవాళి కరోనా వైరస్ రూపంలో కనీవినీ ఎరుగని విపత్తును ఎదుర్కొంటున్నది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిచెందిన దేశాలు, వర్ధమాన దేశాలు అని తేడా లేకుండా ప్రతీ చోటా కోవిడ్-19 ప్రబలుతోంది. ఇటువంటి క్లిష్టతరమైన సమయంలో ప్రభుత్వాలు, ప్రజలు ఈ వైరస్ మరియు వ్యాధి గురించి అవగాహన పెంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఈ ప్రయత్నంలో సాంప్రదాయ సమాచార, వార్తా సంస్థలతో పాటూ ఫేస్ బుక్, యూట్యూబ్, వాట్సాప్, షేర్ చాట్, టిక్ టాక్ వంటి అనేక సామజిక మాధ్యమాలు, ఇంకా వెబ్‌సైట్లు, మొబైల్ అప్స్ వంటి ఇతర డిజిటల్ మాధ్యమాలను మనం ఉపయోగిస్తున్నాము. అయితే అతివేగంగా ప్రపంచమంతా ఈ కొత్త వైరస్ సోకుతుండడంతో సాధికారిక, ప్రామాణిక సమాచారం ఇంకా ఆశించినస్థాయిలో అందుబాటులో లేదు. అందువల్ల కొంతమంది తమ అవగాహనా లోపం వల్ల, లేదా ఆకతాయితనం వల్ల అనేక రకాల తప్పుడు సమాచారాన్ని, వదంతుల్ని వ్యాపింప చేస్తున్నారు. ఈ తప్పుడు సమాచారం, వదంతులు కూడా మరొక మహమ్మారిగా తయారై సాధారణ ప్రజలకి, ప్రభుత్వ యంత్రాంగానికి మరో సవాలుగా పరిణమిస్తున్నాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) బాధ్యతారహితమైన ఈ విచ్చలవిడి తప్పుడు సమాచార, వదంతుల వ్యాప్తిని Infodemic గా అభివర్ణించింది.    

 
 
ఈ నేపథ్యంలో తెలంగాణ పౌరులకు డిజిటల్ మీడియా విభాగం కింది సూచనలు చేస్తోంది అంటూ ప‌లు సూచ‌న‌లు చేసింది. తేడా వ‌స్తే...తాట తీయ‌డ‌మే అనే హెచ్చ‌రిక చేసింది.

డిజిటల్ మాధ్యమాలలో మీకు వచ్చిన సమాచారాన్ని ఇతరులతో పంచుకునే ముందు బాధ్యతతో వ్యవహరించండి, కొంచెం జాగ్రత్త వహించండి అని సూచించింది. 
-సమాచార ప్రామాణికతను రూఢి చేసుకోకుండా ఎట్టిపరిస్థితుల్లోనూ సమాచారాన్ని ఇతరులకు చేరవేయవద్దు.   
- వాట్సాప్ వంటి వేదికలలో బృంద సభ్యులు ఎవరైనా తప్పుడు సమాచారం వ్యాపింపచేస్తే ఆ బృందపు అడ్మిన్స్ దానికి బాధ్యులవుతారు. చట్టపరంగా విచారణను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.  
- డిజిటల్ మాధ్యమాలను ఇప్పుడిప్పుడే వాడుతున్న వారు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం లేని వారి విషయంలో మనం మరింత దృష్టి పెట్టాలి. వారికి ఆ మాధ్యమాలకున్న బలం, బలహీనతలు, పరిధులు,  పరిమితులు, అనుకూల, ప్రతికూలతల గురించి వివరంగా చెప్పాలి. వాటి దురుపయోగం వల్ల కలిగే దుష్పరిణామాలు,  చట్టపరమైన చర్యలపై అవగాహన కలిగించాలి.
-  కరోనా మహమ్మారి విషయంలో అనేక రకాల తప్పుడు సమాచారం వ్యాపిస్తున్నది. ఇటువంటి సందర్భాల్లో వ్యక్తిగత వివరాల గోప్యత అత్యంత ముఖ్యమైన అంశం. వ్యాధి బారిన పడిన వ్యక్తుల గురించి ఎవరు సమాచారం పంపినా దాన్ని మీరు ఇతరులకు పంపకండి. మొదటగా ఆ సమాచారం ప్రామాణికమైనది కాకపోవచ్చు, ఒక వేళ అది ప్రామాణికమైనదైనా అది వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించవచ్చు. ఇది అనైతికమే కాదు శిక్షార్హమైన నేరం కూడా.


- విపత్తుల విషయంలో వదంతులను, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసే వారికి విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని 54వ సెక్షన్ ప్రకారం ఒక సంవత్సరం పాటు జైలుశిక్ష ఇంకా జరిమానా విధించే అవకాశం ఉంది. ఇంకా ఐపీసీ సెక్షన్ 505 ప్రకారం కూడా తప్పుడు సమాచార ప్రచారం శిక్షార్హమౌతుంది.      
 -కరోనా మహమ్మారి నియంత్రణకై తెలంగాణ ప్రభుత్వం అంటువ్యాధుల చట్టం, 1897 కింద తెలంగాణ అంటువ్యాధులు (కోవిడ్-19) నిబంధనలను విడుదలచేసింది. ఈ నిబంధనలలోని 10వ సెక్షన్ ప్రకారం కరోనా వైరస్ కు సంబంధించిన ఎటువంటి సమాచారాన్నైనా సంబంధిత అధికారులతో ధృవీకరించుకోకుండా వార్తా పత్రికలు, టీవీ చానెళ్లు, సామాజిక మాధ్యమాలలో వ్యాప్తి చేయకూడదు. దీనికి విరుద్ధంగా వదంతులు, తప్పుడు సమాచారాన్ని ఎవరైనా వ్యాప్తి చేస్తే సంబంధిత చట్టాల కింద శిక్షార్హులవుతారు.
      
- ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రామాణిక సమాచారం అందరి అవసరం. కరోనా మహమ్మారిపై సమరంలో అది చాలా కీలకం కూడా. డిజిటల్ మాధ్యమాలను ఉపయోగించే వారు ఏ సమాచారం, వార్త ప్రామాణికతపై సందేహం వచ్చినా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే సమాచారం, ప్రధాన స్రవంతి వార్తా మాధ్యమాలు ప్రచురించే, ప్రసారంచేసే సమాచారంతో పోల్చి సరిచూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: