తెలంగాణ రాష్ట్రంలో వరి పంట సాగు, ధాన్యం దిగుబడులు, బియ్యం తయారీ – అమ్మకం – ఎగుమతులు, దీనికి అవలంభించాల్సిన విధానం తదిర అంశాలపై ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్థన్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గంప నాగేందర్, మోహన్ రెడ్డి, నాయకులు చంద్రపాల్, బొచ్చు భాస్కర్, ప్రభాకర్ రావు, తోట సంపత్ కుమార్, కాంతయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నరు. 

 


తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సంద‌ర్భంగా కీల‌క నిర్ణ‌యించారు. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ‘తెలంగాణ రాష్ట్ర సమగ్ర ధాన్యం మరియు బియ్యం విధానం’ రూపొందించనున్నట్లు వెల్లడించారు. రైస్ మిల్లర్లతో పాటు ఇతర భాగస్వాములందరితో చర్చలు జరిపి, విధానాన్ని రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైస్ మిల్లర్లకు ప్రభుత్వం అండగా ఉండి, తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను చేయనున్నట్లు ప్రకటించారు. విధానం ముసాయిదాపై మంత్రివర్గంలో చర్చిస్తామని, అసెంబ్లీలో కూడా చర్చించి, విధానాన్ని ఆమోదిస్తామని వివరించారు.

 

 
‘‘సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి చాలా తేడా వచ్చింది. కాళేశ్వరం సహా ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణం, ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పూర్తి, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ తదితర కారణాల వల్ల రైతులకు సాగునీరు పుష్కలంగా అందుతోంది. దీనివల్ల  రాష్ట్రంలో వరిసాగు పెరుగుతున్నది. ఈ సారి యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నది. కోటి లక్షల టన్నులకు పైగా ధాన్యం వచ్చే అవకాశం ఉంది. ఈ సారి వానాకాలంలో 55 నుంచి 60 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగే అవకాశం ఉంది. ఒక్క కాళేశ్వరం ద్వారానే 35 లక్షలకు పైగా ఎకరాల్లో వరి పంట పండే అవకాశం ఉంది. ప్రపంచమంతా కరువు వచ్చినా తెలంగాణలో రాదు. వచ్చే ఏడాది కనీసం 70 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుంది. తెలంగాణ ప్రతి ఏడాది కనీసం 2.25 కోట్ల లక్షల టన్నుల ధాన్యం పండిస్తుంది. తెలంగాణ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతున్నది. ఈ పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున పండిన ధాన్యాన్ని సేకరించి, మిల్లుకు పంపి బియ్యం తయారు చేసి, వాటిని అమ్మడం చాలా పెద్ద పని. దీనికోసం ఇప్పుడున్న పద్ధతి పనికి రాదు. ఎక్కడా ఎవరికీ ఇబ్బంది లేకుండా పండిన ధాన్యం బియ్యంగా మారి అమ్మకం జరిగే వరకు అన్ని సజావుగా సాగాలంటే సమగ్ర ధాన్యం మరియు బియ్యం విధానం అమలు చేయాల్సిన అవసరం ఉంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

 

‘‘తెలంగాణ వ్యాప్తంగా 2200 రైస్ మిల్లులున్నాయి. ఈ మిల్లులు ఏడాదికి కోటి లక్షల టన్నుల బియ్యం తయారు చేస్తాయి. గతంలో వీటికి సరిపడా ధాన్యం కూడా రాకపోయేది. కరెంటు ఉండకపోయేది. ఫలితంగా 20-30 లక్షల టన్నుల బియ్యం తయారు చేయడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ధాన్యం పుష్కలంగా ఉంది. 24 గంటల నిరంతరాయ కరెంటు ఉంది. దీన్ని మంచి అవకాశంగా మార్చుకుని రైసు మిల్లులు ఎక్కువ మొత్తంలో వడ్లు పట్టాల్సి ఉంది. రాష్ట్ర ప్రజల అవసరాలు తీరడమే కాకుండా, ఎఫ్.సి.ఐ.కి పంపించడానికి, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి అనువుగా మిల్లులు పూర్తి సామర్థ్యంతో పని చేయాలి. ఇంకా మరికొన్ని మిల్లులు రావాలి. దీనికోసం ప్రభుత్వ పరంగా రైసుమిల్లులు బాగా నడవడానికి, అవి లాభాల్లో ఉండడానికి ప్రభుత్వ పరంగా చేయాల్సిన సాయం చేస్తాం. తెలంగాణలోని రైసు మిల్లులు రాష్ట్ర ప్రగతిలో బాగస్వామ్యం కావాలి’’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: