దేశంలో కరోనా కలకలం రేపుతోంది. ఒక పక్క పోలీసులు, ఆరోగ్య సిబ్బంది, నర్సులు, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఎంతగానో శ్రమిస్తున్నారు. లాక్డౌన్తో నేపథ్యంలో అధికారులు కూడా విధులకు హాజరయ్యి తమ వంతు భాద్యత నెరవేరుస్తున్నారు. ఇంటికి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధుల్లో పాల్గొంటున్నారు. అయితే గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గుమ్మాల సృజన కూడా ప్రజల కోసం తన పసిబిడ్డను వదిలేసి విధులకు వస్తున్నారు. కమిషనర్ సృజన మూడు వారాల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే చిన్నారి ఆలనాపాలనా చూసుకోవాల్సిన ఆమె, పసికందు అయిన బాబుని వదిలేసి,సెలవుల్ని కూడా వాడుకోకుండా విధులకు హాజరు అవుతున్నారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.
ప్రజల కోసం, కరోనా నివారణ కోసం విధుల్లో చేరారు. సృజన తన బిడ్డను ఇంట్లోనే వదిలేసి ఆఫీసుకు వస్తున్నారు. పిల్లవాడి బాగోగుల్ని భర్త, తల్లికి వదిలేశారు. ఆమె మద్య, మధ్యలో బిడ్డను చూడటానికి వెళ్లొస్తున్నారు. సృజన భర్త, అమ్మ కూడా కమీషనర్ కి మద్దతుగా నిలిచారు. వాళ్ళ ప్రోత్సహంతోనే తన విధులని నిర్వర్తిస్తున్నారు. జీవీఎంసీ కమిషనర్ కూడా తాను, తన కుటుంబం అని ఆలోచించకుండా ప్రజల కోసం కష్టపడుతున్నారు. నగరవాసులు ఆందోళనలో ఉన్నారని.. వారిలో ధైర్యం నింపాల్సిన బాధ్యత తమపై ఉందంటున్నారు. అందువల్లనే తాను కూడా ఈ కష్ట సమయంలో అండగా ఉండాలని అందుకే విధులకు హాజరవుతున్నట్లు చెబుతున్నారు కమిషనర్.
ప్రజలు కూడా ఎవరికీ వారు బాధ్యతగా లాక్డౌన్కు సహకరించాలని.. ఇళ్లలో నుంచి బయటకు రావొద్దంటున్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా బయటికొచ్చినప్పుడు సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. ముఖానికి మాస్క్ గాని, కర్చీఫ్ గాని కట్టుకోవాలని, చేతులని శుభ్రం చేసుకోవాలని, తుమ్మినా, దగ్గినా రుమాలు అడ్డుపెట్టుకోవాలని సూచించారు ప్రజలకు నిత్యావసరాల కొరత రానివ్వమని,ఎవ్వరు చింతించాలిసిన పనిలేదని తెలిపారు. ప్రతిరోజు అధికారులు, సిబ్బందితో సమీక్ష చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని ఆమె కోరుతున్నారు. ఇకనగరంలో లాక్డౌన్ అమల్లో ఉందని.. నగరంలో ఎవరైనా నిరాశ్రయులు ఉంటే వారికి అండగా నిలుస్తున్నామని కమిషనర్ అన్నారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో నిరాశ్రయుల కోసం 8 షెల్టర్లు ఏర్పాటు చేశామనితెలిపారు. ఇంకా అవసరమయితే ఏర్పాటు చేస్తామని తెలిపారు.