ప్రాణాంతక కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ వైరస్ బారిన పడి 37,820 మందికి పైగా మృతి చెందారు. ఇరాన్లో 41,495 కేసులు(మృతులు 2,757) చోటు చేసుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 7,85,807 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,65,659 మంది కోలుకున్నారు. అయితే, ఇదే అవకాశంగా భావించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై కన్నెర్ర చేస్తున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో పశ్చిమదేశాలకు, ఇరాన్కు మధ్య కుదిరిన అణు ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక రద్దుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ మళ్లీ తన అణు కార్యక్రమం చేపట్టకుండా ఆ దేశంపై గతంలో అమెరికా ఆంక్షలు విధించింది. తాజాగా వాటిని మరింత కఠినతరం చేస్తూ మరో 60 రోజులకు పొడగించింది. ‘ఇరాన్లో అణు కార్యక్రమాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తున్నాం. ఈ ఆంక్షలు ఏ సమయంలోనైనా మరింత కఠినం కావచ్చు. ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అణుబాంబు తయారు చేయనివ్వం అని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి ఓర్టాగస్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, కరోనా వైరస్ సమయంలో మరే దేశాలు కలిసి రాని తరుణం కాబట్టి ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
కాగా, అమెరికాలో కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య మూడు వేలు దాటింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఈ విషయాన్ని చెప్పింది. ఆ దేశంలో మరణాల సంఖ్య 3008కి చేరుకున్నది. మొత్తం లక్షా 60 వేల మందికి వైరస్ సోకింది. మరోవైపు ఇవాళ వైట్హౌజ్లో మీడియా సమావేశం నిర్వహించిన ట్రంప్.. ఓ జర్నలిస్టుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనవసర ప్రశ్నలు అడగవద్దు అంటూ ఆవేశానికి లోనయ్యారు. అమెరికాలో పది లక్షల మందికి కరోనా పరీక్షలు చేపట్టినట్లు ట్రంప్ తెలిపారు. ఇదో మైలురాయి అని అన్నారు. ఆ సమయంలో ఓ రిపోర్టర్ ఓ ప్రశ్న వేశారు. దక్షిణ కొరియా తరహాలో ఎందుకు పరీక్షలు చేపట్టడంలేదని ఆ జర్నలిస్టు అడిగారు. దక్షిణ కొరియా గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు అని ట్రంప్ అన్నారు. అప్పుడు ఆ రిపోర్టర్.. దక్షిణ కొరియా రాజధాని సియోల్ ఎంత పెద్దగా ఉంటుందో తెలుసా అని ప్రశ్నించారు.