కరోనా వైరస్(కోవిడ్-19) సోకిన బాలీవుడ్ ప్రముఖ గాయకురాలు కనికాకపూర్ను ఆ వైరస్ అంత సులభంగా వదిలేలా లేదు. ఇప్పటికే గత పది రోజులుగా ఆమెను ఐసోలేషన్లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు ఆమెకు వైద్యం అందిస్తూ రక్త నమూనాలు స్వీకరించి వైద్య పరీక్షలు చేయగా
నాలుగు సార్లు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు సైతం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇక ఇప్పుడు తాజాగా ఆమె రక్తనమూనాలను తీసుకొని ఐదోసారి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా.. అందులోనూ ఫలితం పాజిటివ్ అనే వచ్చింది.
దీంతో అటు కనికా కపూర్ తీవ్ర దుంఖంలో మునిగిపోయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆమె అభిమానులు.. కుటుంబ సభ్యులు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. కనిక ప్రస్తుతం ఆమె సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వైద్యం అందించే వారికి డాక్టర్లు ప్రతి 48 గంటలకు రిపోర్టులు చేస్తుంటారు. ఈ వైద్య పరీక్షల్లో సహజంగా రెండు సార్లు పాజిటివ్ వచ్చినా తర్వాత అయినా నెగిటివ్ వస్తుంది.. కానీ కనికాకు ఏకంగా ఐదోసారి కూడా పాజిటివ్ వచ్చింది.
అయితే ఆమె ఆరోగ్యం విషమం అంటూ వస్తోన్న వార్తల్లో మాత్రం నిజం లేదట. ఆమె ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, రోజూలానే ఆహారం తీసుకుంటున్నారని వాళ్లు స్పష్టం చేశారు. ఆమె ఆరోగ్యం గురించి సోషల్మీడియాలో వచ్చే వార్తలు అవాస్తవమని వాళ్లు పేర్కొన్నారు.