అమెరికాలో కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. అక్కడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే సుమారు 3606మంది మృతి చెందారు. ఇక బాధితుల సంఖ్య ఏకంగా 181099 అంటే సుమారు రెండులక్షలకు చేరువలో ఉన్నారంటే పరిస్థితులు ఎంత దారుణంగా, దయనీయంగా మారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే అక్కడి ప్రజలకు షాకింగ్ న్యూస్ చెప్పింది. దీంతో ఆ దేశ ప్రజల్లో మరింత భయాందోళనలు మొదలయ్యాయి. కరోనా కట్టడికి ప్రస్తుతం ప్రస్తుతం సామాజిక దూరం పాటించినప్పటికీ కరోనావైరస్ మహమ్మారి నుండి అమెరికాలో 100,000 నుండి 240,000 మరణాలు సంభవిస్తాయని వైట్ హౌస్ ప్రకటించడంతో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది.
అంటే.. కరోనా వ్యాప్తి నిరోధానికి ఎంత కఠినంగా ఉన్నప్పటికీ మరణాల సంఖ్య మాత్రం ఆ స్థాయిలో ఉంటుందని చెప్పడంతో అక్కడి పౌరులేకాదు.. ప్రపంచం కన్నీటిపర్యంతమవుతోంది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా మరో రెండు వారాల పాటు కఠినంగా ఉండాలని హెచ్చరించారు. అమెరికాలో ప్రధానంగా న్యూయార్క్, న్యూజెర్సీలోనే ఎక్కువగా కొవిడ్-19 కేసులు నమోదు అవుతున్నాయి. ఇక అక్కడ వైద్యసేవలను అందించడానికి ఏకంగా నేవీ ఆస్పత్రులను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. జనం పిట్టల్లా రాలుతుండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టినా ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మంగళవారం వరకు ఏకంగా రెండు లక్షలకు చేరువలో కేసుల సంఖ్య ఉంది. రోజుకు కొన్నివేల పరీక్షలు చేస్తున్నారు. మున్ముందు ఈ కేసుల సంఖ్య ఇంకా పెరుగనుంది. ఈ నేపథ్యంలో మరణాల సంఖ్య ఆ స్థాయిలో ఉంటుందని వైట్హౌస్ ప్రకటించిందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివకు 850000 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సుమారు 41వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఇందులో ఇటలీలో 12,428 మంది మరణించగా, 105792 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. స్పెయిన్లో 8,269మంది మరణించగా 94,417 పాజిటివ్ కేసులునమోదు అయ్యాయి.