చైనాలోని వుహాన్ నగరం కేంద్రంగా పుట్టిన కరోనా వైరస్ చూస్తుండగానే.. ప్రపంచాన్ని చుట్టేసింది. దాదాపుగా అన్ని దేశాలకు వ్యాపించింది. అయితే.. సుమారు 80శాతం పాజిటివ్ కేసులు కేవలం ఎనిమిది దేశాల్లోనే నమోదు అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 190కిపైగా దేశాలకు ఈ మహమ్మారి పాకిందని చెబుతున్నా.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం ఆ ఎనిమిది దేశాల్లోనే అత్యధికంగా కనిపిస్తోంది. ఈ విషయం పరిశోధకులకు కూడా అంతుచిక్కడం లేదు. చైనాకు, మిగతా ఏడు దేశాలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి..? ఈ దేశాల్లోనే ఎందుకిలా జరుగుతోంది...? జనమెందుకు పిట్టల్లా రాలిపోతున్నారు..? అనే ప్రశ్నలు పరిశోధకుల మెదళ్లను తొలుస్తున్నాయి.
అయితే.. వైరస్కు పుట్టినిల్లు అయిన చైనాలోని వుహాన్నగరం మాత్రం కోలుకుంటుండగా.. మిగతా ఏడు దేశాలు అల్లాడిపోతున్నాయి. రోజురోజుకూ పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. అంతర్జాతీయంగా విశ్లేషణ ప్రకారం.. ఇప్పటివరకు ఈ ఎనిమిది దేశాల్లో నమోదు అయిన కేసుల సంఖ్య శాతాన్ని చూద్దాం.. యూఎస్లో 21శాతం, ఇటలీలో 13శాతం, స్పెయిన్లో 11శాతం, చైనాలో 11శాతం, జెర్మనీలో 9శాతం, ఫ్రాన్స్లో 6శాతం, ఇరాన్లో 5శాతం, యూకేలో 3శాతం కేసులు నమోదు అయ్యాయి. అంటే మిగతా దేశాల్లో మొత్తం కేసుల సంఖ్య సుమారు 20శాతం కూడా లేదన్నమాట. ఈ గణాంకాలు ఈ ఎనిమిది దేశాల భయానక పరిస్థితులను వెల్లడిస్తున్నాయి.
ఇక అమెరికాలో అయితే.. కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే సుమారు 3606మంది మృతి చెందారు. ఇక బాధితుల సంఖ్య ఏకంగా 181099 అంటే సుమారు రెండులక్షలకు చేరువలో ఉన్నాయి. కరోనా కట్టడికి ప్రస్తుతం ప్రస్తుతం సామాజిక దూరం పాటించినప్పటికీ కరోనావైరస్ మహమ్మారి నుండి అమెరికాలో 100,000 నుండి 240,000 మరణాలు సంభవిస్తాయని వైట్ హౌస్ ప్రకటించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివకు 850000 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సుమారు 41వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఇందులో ఇటలీలో 12,428 మంది మరణించగా, 105792 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. స్పెయిన్లో 8,269మంది మరణించగా 94,417 పాజిటివ్ కేసులునమోదు అయ్యాయి.