జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేపట్టిన పాదయాత్ర ఒక చరిత్ర..! ఏడాదికిపైగా ప్రజలతో మమేకం అవుతూ, వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ ముందుకు సాగిన నడక.. అడుగడుగునా జన ప్రభంజనం! అప్పటి టీడీపీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తూ కొనసాగిన ప్రజాసంకల్పయాత్రను ఆంధ్రులెవరూ అంత సులువుగా మరవలేరు. ఇప్పుడెందుకు ఈ విషయాన్ని చెబుతున్నారని అనుకుంటున్నారా..? ఇది చెప్పాల్సిన సందర్భమే. గుర్తు చేసుకోవాల్సిన అంశమే..! కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలు కాలినడక సొంతూళ్లకు బయలుదేరుతున్నారు. వందల కిలోమీటర్లు నడుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కు చెందిన సుమారు 12మంది విద్యార్థులు మహారాష్ట్ర నుంచి గుంటూరు, నెల్లూరు బయలుదేరారు. ఈ విద్యార్థులు మహారాష్ట్రలోని యావత్మాల్ లో ఐటీఐ(అగ్రికల్చర్) చదువుతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో అక్కడ ఉండలేక కాలినడక సొంతూళ్ల బయలుదేరారు. మొబైల్లో గూగుల్ మ్యాప్ చూసుకుంటూ నడకసాగిస్తున్నారు.
సుమారు 845కిలోమీటర్లకుపైగా ఆ విద్యార్థులు నడకసాగిస్తున్నారు. అనేక ఆంక్షలు, అడుగడుగునా అడ్డంకులను దాటుకుని మంగళవారం ఉదయం వరంగల్కు చేరుకున్నారు. వారిని ఖమ్మం జాతీయ రహదారి వద్ద పోలీసులు అడ్డుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే వచ్చిన వైద్యసిబ్బంది వారిని వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించి పరీక్షలు చేయించారు. విద్యార్థులందరూ ఆరోగ్యంగానే ఉన్నారని నిర్ధారించిన తర్వాత వారిని వదిలేశారు. రాత్రింబవళ్లు కాలినడక సాగిస్తున్న విద్యార్థులను చూసి.. అందరూ సీఎం జగన్ పాదయాత్రను గుర్తు చేసుకుంటున్నారు. భద్రతా సిబ్బంది, చుట్టూ అనుచరులు, వెంట వచ్చే జనంతో జగన్ పాదయాత్ర చేస్తే.. నేడు విద్యార్థులు రోడ్డుపై ఒంటరిగా కాలినడక రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కరోనా నుంచి తమను తాము కాపాడుకోవడానికి చేస్తున్న సాహసయాత్రను చూసిన వారు.. పాదయాత్రలో జగన్ను మించిపోయారని అంటున్నారు. అంతేగాకుండా.. మరికొందరు వలస కూలీలు కూడా కాలినడకన వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈక్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.