ఢిల్లీ, హైదరాబాద్, తెలంగాణలోని ఓ గల్లీ...ఆ మాటకొస్తే...దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఢిల్లీ భయంతో బతుకుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమాలకు హాజరై వచ్చిన వారి గురించి టెన్షన్ అవుతున్నారు. అసలు ఎందరు వెళ్లారు? అందులో ఎందరు తిరిగి వచ్చారు? ఇప్పుడు వారు ఎక్కడెక్కడ ఉన్నారు? అందులో ఎందరికి కరోనా సోకింది? అనే ఆందోళన ఇప్పుడు వ్యక్తమవుతోంది. అయితే, తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఓ మీడియా సంస్థతో కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్డౌన్ సమర్థంగా అమలు చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. ఇప్పటికి తెలంగాణలో సుమారు 70 మందికి కొవిడ్-19 పాజిటివ్ రాగా, చికిత్స తర్వాత వీరిలో 12 మందికి నెగెటివ్ వచ్చిందని తెలిపారు. కరోనాతో ఇబ్బందిపడుతున్న వలస కా ర్మికులు, అల్పాదాయ వర్గాలు, నిరుపేదలకు ఆపన్నహస్తం అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. కీలకమైన ఢిల్లీలో జరిగిన ఓ మత ప్రార్థనలు, అందులో పాల్గొన్న వారి గురించి కేటీఆర్ వివరణ ఇచ్చారు.
నిజాముద్దీన్ ఘటన తర్వాత అప్రమత్తం అయ్యామని, ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొన్నవారి వివరాలను సేకరిస్తున్నామని.. నిజాముద్దీన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ ట్రాక్ చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. ఇందుకోసం కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని తెలిపారు. ఢిల్లీ వెళ్లి వచ్చినవారు తమ సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని సూచించారు. వీరందరికీ ప్రభుత్వమే పరీక్షలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్ళి వచ్చిన వారు వాళ్ళను కలిసిన వాళ్ళంతా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఢిల్లీ నిజాముద్దీన్కు వెళ్ళిన వారి సమాచారం తెలిసినా వెంటనే కంట్రోల్రూంకు లేదా 100కు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలన్నారు. వారందరికీ ప్రభుత్వమే పరీక్షలు నిర్వహిస్తుందని అన్నారు. కాగా, స్వచ్ఛందంగా వారు ముందుకు వస్తే సంతోషమని లేదంటే ప్రభుత్వం ఏ రూపంలో అయినా వారి వివరాలు సేకరించి తగు చికిత్స అందించాలని...లేదంటే సమాజానికి కరోనా రూపంలో పెద్ద ముప్పు వాటిల్లుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.