భార‌త్‌లో క‌రోనా వైర‌స్ రోజురోజుకూ క‌ల‌క‌లం రేపుతోంది. కొవిడ్‌-19 త‌గ్గుతుంద‌ని అనుకుంటున్న త‌రుణంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మ‌ర్క‌జ్ ఉదంతంతో ఒక్క‌సారిగా సీన్ మారిపోయింది. బుధ‌వారం మ‌ధ్యాహ్నం నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 1637కు చేరుకుంది. ఇక మ‌ర‌ణాల సంఖ్య 38కి చేరింది. దీంతో ఒక్క‌సారిగా దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న వ్య‌క్త‌మవుతోంది. ఇదిలా ఉండ‌గా, క‌రోనా వైర‌స్ బారిన వైద్యులు కూడా ప‌డుతున్నారు. తాజాగా.. ఢిల్లీలోని  ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడికి కూడా సోకడంతో ఏకంగా ఆస్ప‌త్రినే మూసివేశారు అధికారులు.  స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ లో పనిచేసే వైద్యుడు (35)కు వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కొవిడ్‌-19 పాజిటివ్ అని తేలడం క‌ల‌క‌లం రేపుతోంది. ఆ వెంట‌నే ఆసుపత్రి ఆవరణ, ఔట్  పేషెంట్ విభాగం, ల్యాబ్స్, ఇతర భవనాలను శానిటైజ్ చేయ‌డానికి మూసిన‌ట్లు అధికారులు చెప్పారు. అయితే, క‌రోనా సోకిన వారిని కూడా క్వారంటైన్‌లో ఉంచిన‌ట్లు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డా. బీఏ షెర్వాల్ అన్నారు. 

 

అయితే.. ఇక్క‌డ విష‌యం ఏమిటంటే.. క‌రోనా బాధితుల‌కు చికిత్స చేయ‌డం వ‌ల్ల ఆయ‌న‌కు రాలేదు. బ్రిటన్ నుంచి వచ్చిన సోదరుడి కుటుంబాన్ని ఇటీవల ఆయన కలిసారని, వారినుంచి వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ తెలిపారు. ఆంకాలజీ విభాగానికి చెందిన ఈ వైద్యుడిని రోహిణిలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రిలో చేరారు. అతని భార్య, బిడ్డను ఢిల్లీ గేట్ సమీపంలోని లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించారు. దీంతో రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్‌గా తేలిన  వైద్యుల  సంఖ్య నాలుగుకి చేరింది. ఇప్ప‌టికే మొహల్లా క్లినిక్ వైద్యులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. మౌజ్‌పూర్‌లోని మొహల్లా ప్రైవేట్‌ వైద్యుడికి కరోనా సోకింది. అనంతరం ఈశాన్య ప్రాంతంలోని హరినగర్ మొహల్లా క్లినిక్‌లకు చెందిన డాక్టర్ దంపతులకు,17 ఏళ్ల కుమార్తెకు మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనావైరస్ పాజిటివ్ తేలింది. ఢిల్లీలో రెండు మరణాలు, 121  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండ‌గా.. ఇటీవ‌ల కేర‌ళ న‌ర్సు కూడా క‌రోనా బారిన ప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: