దిశ ఘటనను తలపించేలా ఉన్న యువతిపై ఒక పదిహేను రోజుల క్రితం అత్యాచారం చేసి, హత్య చేసిన కేసు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో ఈ దారుణం జరిగింది. చనిపోయిన మహిళ ఒంటిపై దుస్తులు లేకపోవడం, అలాగే తలపై బండరాయితో మోది ఉండటం చూసి పోలీసులు కేసు నమోదు చేసారు. హత్యకి గురయిన మహిళ ఎవరు..? హత్య చేసింది ఎవరు అన్న విషయాన్ని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఎన్నో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి అని పోలీసులు తెలిపారు.
ఇక పూర్తి వివరాలలోకి వెళితే... హత్యకు గురైన మహిళది సిక్కిం రాష్ట్రంగా పోలీసులు గుర్తించారు. ప్రేమించిన వ్యక్తే ఈ హత్య చేసాడని గుర్తించారు. ఈ నెల మార్చి 17న ఉదయం తంగడపల్లి శివారులో ఉన్న ఓ వంతెన కింద గుర్తు తెలియని యువతి(30) మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణలో భాగంగా ప్రేమికుడే హత్య చేసాడని చెప్పారు. మహిళపై బండరాయి పెట్టి కొట్టడంతో గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఎట్టకేలకు ఆ మహిళది సిక్కిం రాష్ట్రం అని తేల్చారు. అయితే సిక్కిం లో కూడా ఈ మహిళ మిస్సింగ్పై కేసు కూడా నమోదైంది.
అయితే.. సీసీ ఫుటేజీ, సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మృతదేహాన్ని పారేసేందుకు తీసుకొచ్చిన అద్దె కారును పోలీసులు గుర్తించారు. కారు ధ్రువీకరణ పత్రాలు ఆధారంగా నిందితుడి వివరాలు కనుగొన్నారు. ఆ వ్యక్తి ఫేస్బుక్ ద్వారా మహిళతో పరిచయం పెంచుకొన్నారని, అది వివాహేతర సంబంధానికి దారి తీసిందని పోలీసులు వెల్లడించారు. ఈ వివాహేతర సంబంధం, అలాగే వీరిద్దరి మధ్య జరిగిన ఓ గొడవ కారణంగా ఆ మహిళ హత్యకు గురైందని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన రోజే చనిపోయిన అమ్మాయిని ఇక్కడికి రప్పించాడని తర్వాత వీరి మధ్య మాట మాట పెరిగి గొడవ పెద్దది అయ్యి హత్యకు దారి తీసి ఉండొచ్చని.. నిందితుడికి తోడుగా వాళ్ల బంధువు కూడా హత్యకు సహకరించాడని పోలీసులు నిర్ధారించారు.
హత్య చేశాక మృతదేహాన్ని ఏమి చేయాలో తెలియక ఒక కారుని అద్దెకు తీసుకుని అందులో మృత దేహాన్ని ఉంచి పాడేసేందుకు సిద్ధం అయ్యారు. అర్ధరాత్రి దాటాక తంగడపల్లి వంతెన పై నుంచి తాడు సహాయంతో మృత దేహాన్ని కిందకి దించారని తెలిపారు. ఎవరు గుర్తుపట్టకుండా తలను బండరాయితో మోది చంపేశారని తెలిపారు. ఒంటి మీద ఆనవాళ్లు కూడా దొరకకుండా ఉండాలని దుస్తులను కూడా అక్కడి నుంచి తీసుకెళ్లారని వివరించారు.. చాలా పగడ్భందిగా ప్లాన్ చేసి మరి ఆ మహిళని హత్య చేసారని పోలీసులు తెలిపారు.