పెద్దన్న కుర్చీ కదిలిపోతోంది. ఒక్క చుక్క రక్తం బొట్టు నేలరాలలేదు. అణు బాంబులు ప్రయోగించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఒక్క దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కనబడని బాక్టీరియా ఇపుడు జనాన్ని ఒక్కసారిగా చంపేస్తోంది. ఇదేనేమో మూడవ ప్రపంచ యుధ్ధం అంటే.
ఇప్పటికి జరిగిన రెండు యుధ్ధాలు వేరు. అవి సంప్రదాయ తీరుని కొంత కనబరచాయి. మూడవ యుధ్ధం కనుక వస్తే అది అచ్చంగా అణు యుధ్ధమే అవుతుందని, సగానికి సగం ప్రపంచం సర్వ నాశనం అవుతుందని అంతా ఊహిస్తూ వచ్చారు. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ మూడవ యుధ్ధం వచ్చేసింది.
అయితే అది యుధ్ధంలా కనిపించకపోవడమే ఇపుడు అసలైన విశేషం. అమెరికా పెద్దన్న కుర్చీ కిందకు నీళ్ళు తెచ్చేలా ఈ యుధ్ధం సాగుతోందా అన్న అనుమానాలు ఉన్నాయి. కరోన వైరస్ ఈనాడు ప్రపంచంలో రెండు వందల దేశాలకు ఎగబాకింది. ఎందరినో మరణ శయ్యని ఎక్కించింది. మరెందరికో కాటికి దారి చూపించింది. సగానికి పైగా ప్రపంచాన్ని ఇంట్లో కూర్చే బెట్టేసింది.
కరొనా వైరస్ ని పూర్తిగా తరమాలని దాదాపుగా అన్ని దేశాలూ లాక్ డౌన్ చేసుకున్నాయి. దాంతో కరోన వైరస్ వెళ్ళిపోతుందనుకున్నా తరువాత ప్రపంచం పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న ఇపుడు ఉత్పన్నం అవుతోంది. కరోనా అనంతర పరిణామాలు కనుక చూస్తే ముప్పావు వంతు ప్రపంచం పూర్తిగా ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంటుంది. చాలా దేశాలు పేదరికంతో అలమటిస్తాయి.
అమెరికా వంటి అగ్రరాజ్యం కరోనా దెబ్బకూ అతలాకుతలం అవుతోంది. తరువాత రోజుల్లో అమెరికా తన శక్తి సామర్ధ్యాలు ఇపుడున్న విధంగా చూపించి ప్రపంచ పెద్దన్న అనిపించుకునే అవకాశాలు ఉండబోవని ప్రపంచ మేధావులు విశ్లేషిస్తున్నారు.
ఆ స్థానంలోకి మెల్లగా చైనా దూసుకువచ్చే అవకాశాలు కంపిస్తున్నాయి. ఆర్హ్దిక మాంద్యం ప్రభావం ప్రపంచం అంతా ఉన్నా కూడా చైనాను పెద్దగా ప్రభావితం చేయదని ఇప్పటికే ఐక్య రాజ్యసమితి ఆర్ధిక నివేదికలు ఉన్నాయి. మరోవైపు చైనా కరోనా వైరస్ ని కట్టడి చేసి మెల్లగా పుంజుకుంటోంది.
దాంతో రానున్న రోజుల్లో ప్రపంచ అగ్ర పీఠం మీదకు చైనావే ప్రధాన పోటీదారుగా, ఏకైక నాయకురాలిగా దూసుకువచ్చే అవకాశాలు కచ్చితంగా కనిపిస్తున్నాయి అంటున్నారు. అదే కనుక జరిగితే ప్రపంచ గమనం, ఆర్ధిక, రాజకీయ పరిణామాలు ఏ రకమైన రూపు దిద్దుకుంటాయో వేచి చూడాల్సిందే.