కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను వణికిస్తోంది. ఈ వ్యాధికి సంబంధించిన మూలం, విస్తరణ, వ్యాక్సిన్పై అన్ని దేశాల్లోనూ పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, ఈ క్రమంలో మనం తెలుగువాళ్లమని...హైదరాబాదీలమని బల్లగుద్ధి చెప్పే సందర్భం తెరమీదకు వచ్చే అవకాశం అతికొద్ది రోజుల్లో రానుందని తెలుస్తోంది. కరోనా వైరస్ పుట్టుక, దాని ఉనికి గుట్టును తేల్చే దిశగా కరోనా పుట్టుక, వ్యాప్తి, దాని వల్ల మరేమైనా ఇతర వ్యాధులు ప్రబలుతాయా? చైనా, ఇటలీలోని వైరస్కు, మనదేశంలోని వైరస్కు ఏమైనా తేడాలు ఉన్నాయా? అని పరిశోధనలు చేస్తున్నారు మన హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ ఆండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సంస్థ.
హైదరాబాద్లో నమోదైన కేసుల్లో 15 శాంపిల్స్ ను సేకరించి వాటి జీనోమ్పై రీసెర్చ్ మొదలు పెట్టారు. నాలుగైదు రోజుల్లో వీటి రిజల్ట్స్ వస్తాయని, అందులో కరోనా గుట్టు తేలుతుందని సైంటిస్టులు చెపుతున్నారు. హైదరాబాద్ శాంపిల్స్ వైరస్ జీనోమ్ సీక్వెన్స్, మ్యుటేషన్ పై టెస్టులు చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి శాంపిల్స్ సేకరించనున్నారు. గాంధీ ఆస్పత్రి నుంచి రెండు రోజులుగా సీసీఎంబీకి కరోనా నిర్థారణ పరీక్షలకు సంబంధించి నమూనాలు అందుతున్నాయి. సోమవారం 60 శాంపిల్స్ రాగా.. మంగళవారం మరో 190 శాంపిల్స్ అందాయని మొత్తం 250 నమూనాలకు నిర్థారణ పరీక్షలు చేసి గాంధీకి పంపించినట్లు సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. వెయ్యి శాంపిల్స్ వచ్చినా ఒక్క రోజులోనే టెస్టులు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
కాగా, సాంకేతికంగానే కాదు, ఇతర అంశాల్లోనూ సిద్ధంగా ఉన్నామని రాకేశ్ మిశ్రా అన్నారు. సీసీఎంబీలో రోజుకి వేయి టెస్టులు చేయొచ్చని అన్నారు. అందుకు తగ్గ సామర్థ్యం సీసీఎంబీ సంస్థకు ఉన్నదన్నారు. అవసరమైతే సీడీఎఫ్డీ లాంటి సంస్థల సాయం కూడా తీసుకుంటామన్నారు. సీసీఎంబీ ప్రయోగశాలలో రోగి శాంపిల్ నుంచి వైరస్ను వేరుచేయగలుగుతామని రాకేశ్ మిశ్రా అన్నారు. వైరస్ను నైపుణ్యంతో హ్యాండిల్ చేసే సామర్థ్యం ఉందని ఆయన తెలిపారు. తమకు ఉస్మానియా లాంటి ఆసుపత్రులతో టై అప్ ఉందని, వాళ్లు పంపించే శాంపిల్స్ నుంచి విజయవంతంగా వైరస్ ను వేరు చేయగలుగుతున్నామన్నారు. ఎంత అత్యవసర పరిస్థితి వచ్చినా ఎదుర్కోడానికి అవసరమయ్యే అన్ని ప్రయోగాలు చేస్తున్నామన్నారు. ``వైరస్ని హ్యాండిల్ చేయాలంటే బయోసెఫ్టీ లెవెల్-3 సౌకర్యం అవసరం. అది సీసీఎంబీలో ఉందని, ఆర్ఎన్ఏ కోసమైతే లెవెల్-2 సరిపోతుంది`అని రాకేశ్ మిశ్రా అన్నారు. వ్యాధిని ఎలా అరికట్టాలో అన్నికోణాల్లో పరిశోధనలు చేస్తున్నామన్నారు. వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కల్పించాలని ఆయన కోరారు. వాళ్లే వ్యాధి బారిన పడితే నైతికంగా కుప్పకూలిపోతామని అన్నారు.