ఓవైపు కరోనా వ్యాప్తి..మరోవైపు కఠినంగా లాక్డౌన్ అమలు అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి ఉంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు, పోలీస్ యంత్రాంగం ఎక్కడికక్కడ చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే వారిని క్వారంటైన్ లో పెట్టేస్తున్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని తేల్చి చెప్తున్నారు.
అయినప్పటికీ, చాలామంది స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు రవాణా సౌకర్యం లేక హోం క్వారంటైన్లోనే ఉండిపోతున్నారు. అయితే...ఓ ముగ్గురు వ్యక్తులు పోలీసులకు దొరకకుండా ఊరు చేరాలని ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ కాస్తా అట్టర్ ప్లాప్ కావడంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కడివాళ్లు అక్కడే ఉండడం ఇబ్బందిగా మారి వారు వేసిన ప్లాన్ రివర్స్ అయింది. జమ్మూకశ్మీర్లో ఈ ఘటన జరిగింది.
జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని సూరన్కోట్ సమీపంలోని ఓ కంపెనీలో పూంచ్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు పనిచేస్తున్నారు. అయితే, హఠాత్తుగా ప్రకటించిన లాక్డౌన్ వల్ల వీరు ఇంటికి వెళ్లేందుకు మార్గం కనిపించలేదు. దీంతో వారికి ఓ ఐడియా తట్టింది. దీంతో వెంటనే వారిలో ఒకరు చనిపోయినట్లుగా ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించారు. ఓ ఆంబులెన్స్ను బుక్ చేసుకొని తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే, సహజంగానే పోలీసుల తనిఖీలు ఉంటాయి కదా. మార్గమధ్యంలో సూరన్కోట్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు అనుమానం వచ్చి ఆపి ఆంబులెన్స్ను తనిఖీ చేశారు. అయితే, వాళ్లు తెలివిగా డెత్ సర్టిఫికెట్ చూపించారు. అయితే, పోలీసులు అనుమానం వచ్చింది. శవంలా నటిస్తున్న వ్యక్తి టెంపరేచర్ చూడగా బతికే ఉన్నాడని తెలిసిపోయింది. దీంతో మిగతా వారిని తమదైన శైలిలో విచారణ చేయగా అసలు నిజం బయటపడడంతో అంబులెన్స్ డ్రైవర్తో సహా 5 మందిపై కేసు నమోదు చేశారు. దీంతో ఇల్లు చేరేందుకు ఎత్తుగడ వేసిన వారు కఠకఠాల వెనక్కు చేరారు.