టీడీపీ అధినేత, ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ ఇప్పుడు లేఖల వీరుడు అయ్యారా? జగన్ ప్రభుత్వానికి వరుస పెట్టి లేఖలు సంధిస్తున్నారా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. నిజానికి చంద్రబాబు అంటే.... ఓ విజన్.అప్పటి వరకు కాయితం కలాలకు ఉన్న పనిని సైతం పక్కన పెట్టించి అధికారులు, ఆఖరుకు తన పార్టీ నేతలతోనూ కంప్యూటర్ పట్టించి మౌస్తో పనిచేయించారు. కానీ, ఇప్పుడు ఆయన అధికారం కోల్పోయే సరికి కాయితం , కలానికి పనిచెబుతున్నారు. బాబు చెప్పిన లెక్కల ప్రకారమే ఇప్పటి వరకు చంద్రబాబు అటు కేంద్రానికి కానీ, ఇటు రాష్ట్రానికి కానీ ఆయన రాసిన లేఖలు 10ని మించిపోయాయి. ఈ టైంలో కూడా బాబోరు ఇలాంటి చెత్త రికార్డు సాధిస్తున్నారా ? అని పలువురు జోకులు వేసుకోవాల్సిన పరిస్థితి.
తాజాగా కూడా ఏపీ సీఎం జగన్కు చంద్రబాబు లేఖ సంధించారు. వాస్తవానికి గతంలో ప్రతిపక్షం నాయకుడిగా ఉన్న వైసీపీ అధినేత, ప్రస్తుత సీఎం జగన్ ఎప్పుడూ చంద్రబాబు ప్రభుత్వానికి కానీ, చంద్రబాబుకు కానీ లేఖలు సంధించినట్టు ఎప్పుడూ వినలేదు. కనపడలేదు. ఏదైనా ఉంటే ప్రజలకే చెప్పుకొన్నారు. అదేసమ యంలో అసెంబ్లీలో తన వాయిస్ వినిపించారు. అయితే, ఇప్పుడు ప్రత్యేకమైన సందర్భం ఏర్పడి, కరోనా ఎఫెక్ట్తో ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి, అసెంబ్లీని నిర్వహించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో చంద్రబాబు లేఖలు సందించారని సరి పెట్టుకున్నా.. ఆ లేఖల్లో పసలేకపోవడం చర్చకు వస్తోంది.
అనుభవం అనేక పాఠాలు నేర్పుతుంది. అయితే, చంద్రబాబు అనుభవం ఇప్పుడు ఆయనకు అక్కరకు రావడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఆయన అనుభవాన్ని రంగరించి జగన్ ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేస్తారా? సలహాలు ఇస్తారా? అని టీడీపీ సానుభూతి పరులు ఎదురు చూస్తున్నారు. కానీ, ఆయన ఆ విషయాన్ని పక్కన పెట్టి లేనిపోని విమర్శలు చేస్తున్నారు. తాను రాస్తున్న ప్రతి లేఖలోనూ బాబు నాలుగు విమర్శలు,, రెండు శ్వోత్కర్షలతోనే కాలం గడుపుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం నెలకొన్న కరోనా ఎఫెక్ట్ తో ప్రభుత్వం తలమునకలైన ఉన్న సమయంలో ఇలాంటి విమర్శలు చేయడం తగునా? అనేది జనం వాదన. మరి బాబు లేఖల వీరుడిగా మిగిలిపోతారో.. లేక సరైన పంథాలో వెళ్లి ఉత్తమ నాయకుడిగా పేరు తెచ్చుకుంటారో చూడాలి.