అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత మొండి ఘటమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందర్భం ఏదైనా తన మూర్ఖత్వాన్ని చాటుకోవడంలో ఆయన ముందే ఉంటారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది. ట్రంప్ ఏలుబడిలో ఉన్న అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. మరణాలు కూడా అదే విధంగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1480 మంది మృతి చెందినట్లు జాన్స్ హాఫ్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. అయితే, ఈ సమయంలో ట్రంప్ మాత్రం ఎన్నికల గురించి మాట్లాడారు.
అమెరికాలో ఇప్పటి వరకు 2.76 లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజులోనే 32 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికాలో కరోనాతో ఇప్పటి వరకు 7,392 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా సంభవించిన మరణాలు గురువారం రాత్రి 8:30 గంటల మధ్య నుంచి శుక్రవారం రాత్రి 8:30 గంటల మధ్య సంభవించాయని తెలిపింది.
ఈ ఏడాది అమెరికాలో దేశాధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఎన్నికలపై అనుమానాలు నెలకొన్నాయి. అమెరికాలోని అనేక రాష్ట్రాలు కోవిడ్19 మహమ్మారి వల్ల ప్రైమరీ ఎన్నికలను వాయిదా వేశాయి. అయినప్పటికీ తాజాగా వైట్హౌజ్లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు యధావిధిగా నవంబర్ 3వ తేదీనే జరుగుతాయని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. జనరల్ ఎలక్షన్స్ నవంబర్ 3వ తేదీనే జరుగుతాయని ట్రంప్ అన్నారు.
ఇదిలాఉండగా, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా రేసులో దూసుకువెళ్తున్న మాజీ ఉపాధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ ప్రజలను ఈమెయిల్ ఓటింగ్కు సిద్ధం కావాలంటూ సూచిస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈమెయిల్ ఓటింగ్కు అవకాశాలు ఉన్నట్లు బైడెన్ తెలిపారు. దీనిపైనా ట్రంప్ స్పందిస్తూ...``కరోనా వైరస్ నేపథ్యంలో ఓటర్లు పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేయడం కొంత ఆందోళన కలిగించే విషయమే. కానీ, ఈ-మెయిల్ ద్వారా ఓటింగ్ వేసే ప్రక్రియను ట్రంప్ వ్యతిరేకించారు. ఈమెయిల్ ఓటింగ్ వల్ల అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని ట్రంప్ అన్నారు. ఈమెయిల్ ఓటింగ్తో చాలా మంది మోసం చేస్తారన్నారు. బూత్కు వెళ్లి గర్వంగా ఓటెయ్యాలన్నారు. ఓటరు ఐడీతోనే ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.