ప్రపంచవ్యాప్తంగా కలవరానికి కారణమైన కరోనా వైరస్ విషయంలో కొత్త సంచలనం తెరమీదకు వచ్చింది. కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు చాలా దేశాలు లాక్ డౌన్ ఆంక్షలను విధించాయి. దీంతో ప్రపంచంలో సగం జనాభా ఇంటికే పరిమితం అయిపోయింది. నిర్బంధం, కర్ఫ్యూలు, క్వారెంటైన్ల లాంటి ఆంక్షలను సుమారు 90 దేశాలు పాటిస్తున్నట్లు ఏఎఫ్పీ వార్త సంస్థ ప్రచురించిన డేటా వెల్లడించింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 390 కోట్ల మంది ప్రజలు ఇంటికి పరిమితం అయ్యారని ఆ సర్వే పేర్కొంది. కాగా, ఈ పరిణామాల విషయంలో ఓ ప్రపంచ ప్రముఖుడికి వ్యతిరేకంగా పరిణామాలు మారుతున్నాయి.
కరోనా మహమ్మారి ప్రమాదాన్ని అంచనా వేయటంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అధ్యక్షుడు టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేసుస్ పూర్తిగా విఫలమయ్యారని జపాన్ ఉప ప్రధాని తారో అసో దుయ్యబట్టారు. కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. డబ్ల్యూహెచ్వో తన పేరును చైనా హెల్త్ ఆర్గనైజేషన్గా మార్చుకోవాలని తారో అసో మండిపడ్డారు. శుక్రవారం జపాన్ చట్టసభ సభ్యులనుద్దేశించి ప్రసంగించిన ఆయన సొంతంగా ఎలాంటి విచారణ జరుపకుండానే చైనాలో కరోనా వ్యాధిగ్రస్తులు, మృతుల గురించి ఆ దేశం చెప్పిన లెక్కలను ఎలా ధృవీకరిస్తుందని ప్రశ్నించారు. గెబ్రెయేసుస్ను పదవి నుంచి తొలగించేందుకు చేంజ్ డాట్ ఓఆర్జీలో పిటిషన్లు నడుస్తుందన్నదని జపాన్ ఉప ప్రధాని అన్నారు. ఈ పిటిషన్పై కనీసం 5లక్ష మంది సంతకాలు చేస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని భావించాల్సి వస్తుందని, ఇప్పటికే దానిపై 7లక్షల మంది సంతకాలు చేశారని జపాన్ ఉప ప్రధాని తెలిపారు.
కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతోంది. స్పెయిన్లో కరోనా వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య పది వేలకు చేరుకుంది. గత 24 గంటల్లో ఆ దేశంలో సుమారు 950 మంది మరణించారు. ఇటలీలో కూడా వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10వేలు దాటింది. సుమారు లక్షా పది వేల మందికి వైరస్ సంక్రమించింది. అయితే స్పెయిన్లో మాత్రం సంక్రమణ రేటు తగ్గినట్లు ఆరోగ్య అధికారులు వెల్లడించారు. స్సెయిన్లో వైరస్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతున్ని. ఇటలీలో కూడా గత వారంతో పోలిస్తే కొత్త ఇన్ఫెక్షన్లు తగ్గాయి. స్పెయిన్లో నిరుద్యోగుల సంఖ్య అత్యధికంగా మూడు లక్షలకు చేరుకున్నది. శుక్రవారం నుంచి థాయిలాండ్లో కర్ఫ్యూ విధిస్తున్నారు. దీంతో నిర్బంధ ప్రజల సంఖ్య మరింత పెరగనుంది.