భారత దేశ వ్యాప్తంగా రోజురోజుకు విజృంభిస్తూ ప్రజలందరిలో ప్రాణ భయం కలిగిస్తోంది కరోనా వైరస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చి ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇంటికి పరిమితం అయ్యేలా చేస్తున్నప్పటికీ... కరోనా వైరస్ నియంత్రణ మాత్రం ఎక్కడా జరగడం లేదు. రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగి పోతూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నియంత్రించడంలో ఎలాంటి కఠిన నిబంధనలను అమలు చేయడానికైనా వెనకాడడం లేదు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెడ్ జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో అయితే మరిన్ని కఠిన నిబంధనలను అమలు చేసి.... ప్రజలు ఇంటి నుండి కాలు బయట పెడితే చాలు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ సర్కార్ మరో కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. యూపీలోని కాన్పూర్లో కరోనా వైరస్ కదలికలు కనిపించిన ప్రాంతాలను రెడ్ గా ప్రకటించింది ప్రభుత్వం. ఈ ప్రాంతాలన్నీ భారీఖేడ్ ల తో పూర్తిగా మూసివేశారు. ఇక ఇళ్ల నుంచి ఎవరు బయటకు రాకుండా ఉండేందుకు డ్రోన్ కెమెరా లో పర్యవేక్షిస్తున్నారు పోలీసులు.
ఈ క్రమంలోనే ప్రభుత్వ నిబంధనలను లెక్కచేయకుండా గుంపులుగా తిరిగే వారిపై కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ముఖ్యంగా అన్వార్గంజ్ , బేకాగంజ్ , చమన్ గంజ్, బాబుపూర్వ, కర్రల్ గంజ్ ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించినట్లు డి ఐ జి ఆనంద్ దేవ్ వెల్లడించారు. రెడీ జోన్ ప్రకటించిన ప్రాంతాలలో మసీదులు ఎక్కువగా ఉన్నాయి. అయితే కరోనా వైరస్ సోకిన వారు ఎక్కువగా మసీదులకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణం వల్లే అక్కడి ప్రాంతాలను మొత్తం సీల్ చేశారు అధికారులు. అయితే అక్కడి ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలు నిఘాలో ఉండడంతో తొమ్మిది మంది ఒకే చోట గుమిగూడి కనిపించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.