కేసీఆర్ సార్ అంటే కేసీఆర్ సారే..! అంతుచిక్కని వ్యూహాలు ఆయన సొంతం! ప్రత్యర్థిని ఎప్పుడు ఎక్కడ ఎలా దెబ్బకొట్టాలో ఆయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదంటే అతిశయోక్తి కాదేమో..! శత్రువు మెడలు వంచడంలో.. దారికి తెచ్చుకోవడంలో ఆయనది ప్రత్యేకమైన పంథా..! అంటూ ఆయన అభిమానులు మురుస్తున్నారు. అయితే.. ఇప్పుడెందుకు ఈ ముచ్చట్లు చెబుతున్నారని అనుకుంటున్నారా..? మీ సందేహం నిజమే.. ఇప్పుడు మనల్ని కనిపించని శత్రువు కరోనా వైరస్ తరుముకొస్తోంది. కంటికి కునుకులేకుండా చేస్తోంది. ఆ శత్రువు పనిపట్టడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సఫలీకృతులవుతున్నారని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీసుకుంటున్న చర్యలు కరోనాను కట్టడి చేస్తున్నాయి. ఓ వైపు కరోనా వైరస్పై ప్రజలను అప్రమత్తం చేస్తూనే.. వారిలో ఆత్మస్థైర్యం నింపుతూనే.. మరోవైపు బాధితులను కాపాడేందుకు ఆయన చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తున్నాయి.
నిజానికి.. చైనాలోని వుహాన్నగరంలో పుట్టిన కరోనా వైరస్ చూస్తుండగానే ప్రపంచాన్ని చుట్టేసింది. ప్రపంచ దేశాలనూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే వేలమంది ప్రాణాలను బలితీసుకుంది. లక్షల మంది దీని బారినపడ్డారు. అయితే.. భారత్లో కూడా కరోనా ప్రభావం క్రమంగా పెరుగుతోంది. అయితే.. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం కన్నా.. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఒక్క అడుగుముందే ఉన్నారు. గత ఏడాది డిసెంబర్లో కొవిడ్-19 వెలుగులోకి వచ్చింది. ఇదే సమయంలో పరిసరాల పరిశుభ్రత ఎంత ముఖ్యమో గుర్తించిన సీఎం కేసీఆర్ వెంటనే పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పరిసరాల పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా అధికారయంత్రాంగమంతా పల్లేపట్నంలో పర్యటించింది. అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఇంతటి కట్టుదిట్టమైన చర్యలతోనే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర, కోటిమందికిపైగా భక్తులు హాజరయ్యే మేడారం మహాజాతరను గత ఫిబ్రవరిలో విజయవంతంగా నిర్వహించారు.
ఇదే సమయంలో కరోనా వైరస్ అనగానే ప్రజల్లో భయం కలిగేలా కాకుండా.. వారిలో అవగాహన కల్పించడే ధ్యేయంగా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు. ప్రభుత్వంలోని అన్నిశాఖల అధికారులు, సిబ్బంది మొత్తం పట్టణాలు, పల్లెల్లో విస్తృతంగా పర్యటించారు. మరోవైపు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆ తర్వాత కేంద్రంకంటే ముందుగానే తెలంగాణలో ఒక్కరోజు లాక్డౌన్ ప్రకటించారు. ఇలా.. కనిపించని శత్రువు కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ తనదైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. అంతేగాకుండా.. లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికులు, కూలీలు ఆకలితో అలమటించకుండా.. ఒక్కొక్కరికీ 12కిలోల బియ్యంతోపాటు రూ.500 అందించి దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. కరోనా బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా తెలంగాణలో ఆశాజనకంగా ఉంటోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్పై ప్రధాని నరేంద్రమోడీ కూడా ప్రశంసలు కురిపించారు.