ప్రధాని నరేంద్ర మోడీపై కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. కరోనా కట్టడికి ఏప్రిల్ 5వ రాత్రి 9గంటలకు నిమిషాలపాటు విద్యుత్ లైట్లు బంద్ చేసి దీపాలు వెలిగించి, సంకల్పబలాన్ని చాటాలని పిలుపునిచ్చిన ప్రధాని.. అందుకు శాస్త్రీయమైన కారణాలు చెప్పాలని, దీపాలు వెలిగించే కార్యక్రమం కరోనా వ్యాప్తిని ఎలా కట్టడి చేస్తుందో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. మోడీ ఇచ్చిన పిలుపులో రాజకీయ స్వార్థం దాగివుందని, బీజేపీ ఆవిర్భావ(ఏప్రిల్ 6) దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీపాలు వెలిగించాలంటూ దేశప్రజలకు పిలుపునిచ్చారని కుమారస్వామి విమర్శలు గుప్పించారు. ఇప్పటివరకు కరోనా బాధితులకు కనీసం పీపీఈలు అందించలేని మోడీ.. కరోనా నుంచి ఎలా బయటపడాలో చెప్పలేని మోడీ.. ఇలాంటి కార్యక్రమాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. కాగా, కుమారస్వామి చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విమర్శలు చేయడం తగదని పలువురు అంటుంటే.. మరికొందరు మాత్రం కుమారస్వామికి మద్దతుగా నిలుస్తున్నారు.
అయితే.. మోడీ ఇచ్చిన పిలుపులో ఎంతో శాస్త్రీయ ఆలోచన దాగి ఉందని పలువురు అంటున్నారు. సంఖ్యాశాస్త్రం ఆధారంగానే ఆయన ఈ పిలుపుని ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. అంతేగాకుండా.. రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా మహమ్మారిపై విజయం సాధిస్తామనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడానికే మోడీ పిలునిచ్చారని మరికొందరు అంటున్నారు. ఇలా ఎవరివాదనలు వారు వినిపిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండడానికే ప్రధాని దీపాలు వెలిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెబుతున్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాలపాటు విద్యుత్ లైట్లను బంద్ చేసి, దీపాలు వెలిగించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. కరోనా వైరస్ కట్టడికి దేశప్రజలు తమ సంకల్పబలాన్ని చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రజలకు పిలుపునిచ్చారు.