భారత్లో కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్రమవుతోంది. గడిచిన 24గంటల్లో( ఆదివారం సాయంత్రం 4గంటల వరకు) మొత్తంగా 742 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 11మరణాలు సంభవించాయి. ఇక ఇప్పటివరకు 262మంది కరోనా బారి నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3374 కేసులు నమోదు కాగా, 79మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. దేశంలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మర్కజ్ ఉదంతం తర్వాతే దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలు ప్రధాని మోడీ తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
ఇక ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా బీభత్సం సృష్టిస్తోంది. అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఇరాన్, చైనా.. ఇలా అనేక దేశాల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. వేలాదిమందిని బలితీసుకుంటోంది. లక్షల మంది దీనిబారినపడుతున్నారు. 12లక్షల మందికిపైగా కరోనా బారినపడ్డారు. 64వేల మంది మరణించారు. ఇక రెండు లక్షల నలభైఏడు వేల మంది కరోనా బారి నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాయి. ఇందులో ఒక్క అమెరికాలోనే మూడు లక్షల మందికిపైగా కరోనా బారినపడ్డారు. ఎనిమిదివేల మందికిపైగా కరోనాతో మృతి చెందారు. సుమారు 15వేల మంది కోలుకున్నారు. ముందుముందు కరోనా బారిన పడే వారి సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే.. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. చైనాలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. ఒక్కరోజే ఏకంగా 24 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే.. ఇవన్నీ కూడా ఇతర దేశాల నుంచి వారివేనని చైనా ప్రభుత్వం ప్రకటించింది.