కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. ప్రస్తుతం ప్రపంచదేశాలను కమ్మేసి.. ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ లేకపోవడంతో.. నివారణపైనే దేశదేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ లాక్డౌన్ విధించడంతో పాటు కఠన చర్యలు సైతం తీసుకుంటున్నారు. దీంతో ప్రజలందరూ ఇంటికే పరిమితం అయ్యారు. అయితే భారత్లో లాక్డౌన్ 9 రోజులు పూర్తైన తర్వాత సోషల్ మీడియా ద్వారా ప్రజల ముందుకు వచ్చిన ప్రధాని మోదీ ఆదివారం రాత్రి 9 గంటలకు దేశ ప్రజలంతా తమ ఇళ్ల లైట్లు ఆర్పేసి... 9 నిమిషాలపాటూ... కొవ్వొత్తులు, దీపాలు, అగరబత్తులు, టార్చిలైట్లు, మొబైల్ ఫ్లాష్ లైట్ల వంటివి వెలిగించాలని పిలుపు ఇచ్చారు.
కరోనా వైరస్ని దృష్టిలో ఉంచుకొనే ప్రధాన మంత్రి ఈ ప్రకటన చేశారని మనందరికీ తెలుసు. కోవిడ్ -19పై పోరాటంలో దేశ సమైక్యతను, స్ఫూర్తిని చాటేందుకు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాలపాటు ఈ విధంగా చేయాలని ఆయన కోరారు. దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు. దీపం జ్యోతి పరబ్రహ్మా.. అసతోమా సద్గమయ.. తమసోమా జ్యోతిర్గమయ.. ఇలా దీపం జ్యోతి ఔన్నత్యాన్ని చెప్పుకునే అంశాలు అనేకం ఉన్నాయి. కార్యక్రమం ఏదైనా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించడం ఆనవాయితీ.
ఇక సంకట విపత్తుల చీకట్లు అలమకున్న మనుషుల మనసులను ఆశా వెలుగుల వైపు నడపడం, నడిపించడం, లోకానికి ఉత్సాహ పూర్వక శాంతి సౌఖ్యాలు అందించడం, మానవ ప్రయత్నాలకు దైవ బలము తోడై నిలవాలని, త్యైలోక తిమిరాల తొలగించాలని కోరుకునే విఙ్ఞులు చేయవలసిన కర్తవ్యం. ఈ క్రమంలోనే మోదీ `లైట్ దియా` పిలుపు ఇవ్వడానికి ప్రధాన కారణం... కరోనా వైరస్పై పోరాడేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో కాన్ఫిడెన్స్ నింపడానికే. ఎప్పుడైతే దేశ ప్రజలంతా ఒక్కటై దీపాలో, కొవ్వొత్తులో, టార్చిలైట్లో... ఏవో ఒకటి వెలిగిస్తే... అంతా ఒకే తాటిపై ఉన్నారనీ, అందరూ కలసికట్టుగా ఉన్నారనే భావన అందరిలోనూ కలుగుతుంది. అంది ప్రజల్లో కాన్ఫిడెన్స్ పెంచుతుందని ప్రధాని మోదీ భావిస్తున్నారు.