అగ్రరాజ్యం కరోనాతో కకావికలమవుతోంది..ఇంకా చెప్పాలంటే ప్రతీ అమెరికన్లోనూ ఇప్పుడు ప్రాణభయం పట్టుకుంది. కరోనాను ముందు తక్కువ అంచనా వేసినందుకు ఇప్పుడు ఆ దేశం భారీ మూల్యాన్నే చెల్లించుకుంటోంది. రోజు వేలల్లో కొత్తగా కేసులు నమోదవుతుండగా..వందల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వైరస్ విషయం దాచిపెట్టిందని చైనాపైనా వారం క్రితం వరకు బహిరంగ వేదికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే అలా నోరు మూసేయడం వెనుక వ్యూహాత్మక ధోరణే కారణమని ఇప్పుడు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంతకీ ఆ వ్యూహాత్మక ధోరణి ఏమనుకుంటున్నారా...? చైనాతో ఇప్పుడు చేయాల్సి పొట్లాట కాదు..స్నేహం అంటూ కొంతమంది రాజకీయ పండితులు చేసిన సూచనను ట్రంప్ పాటిస్తున్నారట. అందుకే అమెరికాకు వెయ్యి వెంటిలేటర్లు కావాలని కోరడం..దానికి డ్రాగన్ దేశం వెంటనే తప్పక అందజేస్తామని పంపించడం చకచకా జరిగిపోతోంది. ఇటువంటి ఆపత్కాలంలో చైనా 1000 వెంటిలేటర్లను న్యూయార్కు అందించేందుకు సిద్ధమైంది. త్వరలో వాటిని జాన్ఎఫ్ కెడీ విమానాశ్రయానికి తరలించనుంది. ఈ నిర్ణయంపై న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కుమో స్పందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆపత్కాలంలో చైనా సహాయం మరువలేనిదని, ఈ సహాయం తమకు ఎంతో విలువైనదని చెప్పారు.
చైనాలో కరోనా వైరస్ అదుపులోకి రావడంతో యథాస్థితికి చేరుకుంది. అక్కడ జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. వ్యాపారాలు, పారిశ్రామిక రంగం ఇప్పుడిప్పుడే కుదుటుపడుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చైనా వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో ఎగుమతులు భారీగా పెరగడం గమనార్హం. భారత్ కూడా వైద్య పరికరాలు కావాలని ఆర్డర్ ఇచ్చిన విషయం విదితమే. స్పెయిన్, ఇటలీ, జర్మనీ ఇలా దాదాపు కరోనా బారిన పడిన ప్రతీ దేశానికి చైనా వైద్య పరికరాలను ఎగుమతి చేస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా కేసు లక్ష దాటాయి. ఇక్కడే వెంటిలేటర్ల అవసరం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.