లాక్ డౌన్ తో దేశ వ్యాప్తంగా దినసరి కూలీలు , ఉపాధి కార్మికులు , చిరుద్యోగులు అల్లాడిపోతున్నారు . కూలీ పనులు లేక పూట గడవక దినసరి కూలీలు ఇబ్బందులుపడుతుంటే , ఇక ఉపాధి కార్మికుల పరిస్థితి సరేసరి . చిరుద్యోగులకు చేతికి జీతాలందకా, ఇంటి అద్దెలు ఎలా చెల్లించాలో తెలియక , రోజు వారి నిత్యావసరాల కోసం వారు పడుతోన్న అగచాట్లు అన్ని ఇన్ని కావు . అయినా కరోనా కట్టడి కోసం దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇచ్చిన పిలుపు మేరకు ఇంటి గడప దాటకుండా లాక్ డౌన్ పాటిస్తున్నారు . కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశ వ్యాప్తంగా ప్రకటించిన లాక్ డౌన్ ఈ నెల 14 వతేదీ తో ముగియనుంది .
అయితే లాక్ డౌన్ పొడిగించే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి . దీనిపై కేంద్రం ఎటువంటి సంకేతాలను ఇవ్వలేదు . ఒకవేళ లాక్ డౌన్ కొనసాగిస్తే దినసరి కూలీలు , ఉపాధి కార్మికులు , చిరుద్యోగులు పరిస్థితి ఏమిటన్నది అంతుచిక్కడం లేదు . లాక్ డౌన్ గడువును ఇంకా కనుక కేంద్ర , రాష్ట్రాలు పొడగించాలని నిర్ణయిస్తే మాత్రం కిందిస్థాయి వర్గాల ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతమన్నది నిర్వివాదాంశం . అయితే దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మరి శరవేగంగా విస్తరిస్తోన్న ప్రస్తుత తరుణం లో లాక్ డౌన్ ను ఎత్తివేస్తే , కరోనా ను ఎలా కట్టడి చేయడం అన్నది అంతుచిక్కని విషయమే .
ఒకవేళ లాక్ డౌన్ ఎత్తివేస్తే రోజు వారి పనుల్లో రోజువారీ కూలీలు , ఉపాధి కార్మికులకు సామాజిక దూరాన్ని పాటించడం అన్నది అసాధ్యమన్న విషయం తెల్సిందే . అయితే లాక్ డౌన్ అనంతరం కరోనా కట్టడికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి రూట్ మ్యాప్ ముందుకువెళ్తాయన్నదే ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది .