ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకునున్నఓ మహిళ మొదటి ప్రియుడ్ని వద్దనుకుంది ... రెండవ ప్రియుడితో కలిసి మొదటి ప్రియుడ్ని హత్య చేసింది . వివరాల్లోకి వెళితే కడప జిల్లా ముద్దునూరు మండల పరిధిలోని బందలకుంట గ్రామానికి చెందిన నగేష్ భవన నిర్మాణకార్మికుడు . తనతో కలిసి భవననిర్మాణ పని చేసే చిలమకూరు గ్రామానికి చెందిన వరలక్ష్మి తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు . అయితే ఇద్దరి మధ్య కొన్నాళ్లపాటు వివాహేతర సంబంధం సాఫీగానే కొనసాగింది. అయితే ఇంతలో వరలక్ష్మి ప్రవర్తన లో మార్పు వచ్చింది . వరలక్ష్మి ,నగేష్ ను కాదని వెంకట గంగాధర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది . గతంలో తనతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేసిన వరలక్ష్మి తనని దూరం పెట్టడాన్ని నగేష్ సహించలేకపోయాడు .
ఇదే విషయమై వరలక్ష్మి ని నగేష్ గట్టిగా నిలదీశాడు . దీనితో తనకు , గంగాధర్ కు మధ్య అడ్డుగా ఉన్న నగేష్ ను రెండవ ప్రియుడితో కలిసి హత్య చేయాలని వరలక్ష్మి పథకరచన చేసింది . మార్చి 27 వతేదీన నగేష్ కు ఫోన్ చేసిన వరలక్ష్మి తాను కడప లో ఉన్నానని , ఎక్కడికైన తీసుకువెళ్ళమని కోరింది . దాంతో వరలక్ష్మి కవ్వింపుకు లొంగిపోయిన నగేష్ , ద్విచక్ర వాహనం పై వచ్చి ఆమెను నగర శివారులోని మామిడితోట కు తీసుకువెళ్లాడు . అప్పటికే ఈ విషయాన్ని వరలక్ష్మి గంగాధర్ కు తెలియజేసింది . గంగాధర్ మామిడితోటకు చేరుకొని వెనుక నుంచి నగేష్ మెడకు టవల్ బిగించి హత్య చేశాడు . ఈ హత్యకు వరలక్ష్మి పూర్తిగా సహకరించింది .
తమపై అనుమానం రాకుండా ఉండేందుకు బంగారం గొలుసు, ఉంగరం తీసుకుని అక్కడి నుంచి ఇద్దరు జారుకున్నారు . మామిడి తోటలో శవాన్ని గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు . దీనితో రంగంలోకి దిగిన పోలీసులు వరలక్ష్మి పై అనుమానం తో తమదైన పద్దతి లో విచారించగా అసలు విషయాన్ని పోలీసులకు వెల్లడించింది .