భారత్లో కొవిడ్-19 బీభత్సం సృష్టిస్తోంది. రోజురోజుకూ తన ప్రతాపం చూపుతోంది. ఆదివారం రాత్రి వరకు ఏకంగా పాజిటివ్ కేసుల సంఖ్య 4218కు చేరుకుంది. 124మంది మృతి చెందారు. 24గంటల వ్యవధిలోనే అంటే ఆదివారం రాత్రి వరకు ఏకంగా 27మంది మరణించారు. ఈ గణాంకాలే చెబుతున్నాయి దేశంలో కరోనా ఎలా విజృంభిస్తుందో..! ఆదివారం ఒక్కరోజే మహారాష్ట్రలో మొత్తం 13మంది మరణించడం గమనార్హం. దీంతో మహారాష్ట్రలో మరణాల సంఖ్య 45కు చేరుకుంది. ఇది దేశవ్యాప్తంగా నమోదైన మరణాల్లో ఏకంగా 45శాతం ఇక్కడే ఉన్నారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చునని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక మరొక విషయం ఏమిటంటే.. గత నాలుగు రోజులుగా దేశంలో 500కుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 748 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా ముంబై వాసులు బెంబేలెత్తిపోతున్నారు.
మహారాష్ట్ర తర్వాత 571 కరోనా పాజిటివ్ కేసులతో తమిళనాడు, 503 కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ కలకలం రేపుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు.. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్డౌన్కొనసాగుతోంది. అయినా.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గకపోవడంతో ప్రభుత్వాలతోపాటు ప్రజల్లోనూ ఆందోళన కలుగుతోంది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. లాక్డౌన్ డెడ్లైన్ కూడా దగ్గరపడుతోంది. ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్డౌన్ ఉంది. ఈ నేపథ్యంలో గడువు దగ్గరపడుతున్నకొద్దీ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలాగే పెరుగుతూ ఉంటే.. లాక్డౌన్ ఎత్తేసే అవకాశం ఉండదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో మానసిక స్థైర్యం నింపేందుకు ప్రధాని మోడీ ఇప్పటికే పలు కార్యక్రమాలుచేపట్టారు. ఆదివారం రాత్రి 9గంటలకు 9నిమిషాలపాటు దీపాలు వెలిగించి, దేశప్రజలందరూ తమ సంకల్పబలాన్ని చాటుకున్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేదాకా ఒక్కటిగా ఉంటామని ప్రతినబూనారు. ముందుముందు మోడీ ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునిస్తారో చూడాలి మరి.