కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ డెడ్లైన్ దగ్గరపడుతోంది. ఏప్రిల్ 14తేదీకి ఇంకా ఏడు రోజులే మిగిలి ఉన్నాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం అమాంతంగా పెరుగుతోంది. మరణాలు కూడా ఎక్కువగానే సంభవిస్తున్నాయి. ఆదివారం రాత్రి వరకు దేశవ్యాప్తంగా 4218 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 127మంది మృతి చెందారు. ఇక వచ్చే వారం రోజుల్లోనే కేసుల సంఖ్య తగ్గే అవకాశం మాత్రం అస్సలు కనిపించడం లేదు. మరింతగా పెరగడం ఖాయమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీల్లో మరింత వేగం పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలను కేంద్రం తీసుకుంటోంది. ప్రస్తుతం రోజుకు పదివేల పరీక్షలు చేస్తున్నారు. వచ్చే రెండుమూడు రోజల్లో ఈ సంఖ్యను రెట్టింపు చేయడానికి అవసరమైన పరికరాలను సమకూర్చుతున్నారు అధికారులు. పరీక్షల్లో వేగం పెంచితే.. సకాలంలో బాధితులకు చికిత్స అందించవచ్చునని, అప్పుడే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అవకాశం ఉంటుందని వైద్యవర్గాలు అంటున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర కేబినెట్ అత్యంత కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలోనే ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏప్రిల్ 14వరకు కొనసాగనున్న లాక్డౌన్పైనే మంత్రవర్గ సమావేశంలో ప్రధానంగ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలోని ఎన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో కరోనా వైరస్ ప్రభావం ఉంది.. ఇప్పటివరకు ఎక్కడి వరకు వైరస్ విస్తరించింది..? తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఏప్రిల్ 14న లాక్డౌన్ను ఎత్తివేయాలా..? వద్దా..? ఒకవేళ పొడిగిస్తే.. ఎప్పటివరకు అనే అంశాలపై చర్చించి, నిర్ణయం కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని, అయితే.. లాక్డౌన్ నిర్ణయాన్ని మాత్రం 14న రాత్రి వెల్లడించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు కూడా చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.