కరోనా వైరస్ మనుషులనే కాదు జంతువులను కూడా వదలడం లేదు.. ఇప్పటికే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్-19.. వేలాదిమంది ప్రాణాలను బలితీసుకుంది. లక్షలాదిమంది ఈ వైరస్ బారినపడ్డారు. అయితే.. ఇప్పటివరకు కేవలం మనుషులకు మాత్రమే సోకిన కరోనా.. తాజాగా.. ఓ జూలోని పులికి కూడా సోకడంతో కలకలం రేగుతోంది. ఏం జరుగుతుందో తెలియక అధికారులు ఆగమాగం అవుతున్నారు. మనుషులకు వైద్యం చేయడానికే ఆస్పత్రులు చాలడం లేదు.. సరైన సిబ్బందిలేరని ఓ వైపు బాధపడుతుండగా.. ఇప్పుడు జంతువులకు కూడా కరోనా సోకుతుండడంతో మరింత ఆందోళన కరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి.
కొద్దిరోజుల క్రితం ఇటలీలో ఓ పిల్లికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా.. అమెరికాలో ఓ పులికి కరోనా పాజిటివ్ వచ్చింది. అమెరికాలని బ్రోంక్స్ జూలో నాలుగేళ్ల వయస్సున్న మలయన్ అనే ఆడపులికి కొవిడ్-19 సోకినట్లు యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నేషనల్ వెటర్నరీ లాబరేటరీస్ సర్వీసెస్ బృందం నిర్ధారించింది. జూలో జంతువుల ఆలనాపాలనా చూసుకునే ఓ ఉద్యోగి నుంచి పులికి కరోనా సోకినట్లు తెలిపింది. ఆ ఉద్యోగి కరోనా అనుమానిత లక్షణాలు ఉండడంతో అప్పట్లోనే అంటే మార్చి 16 నుంచి బ్రోంక్స్ జూలో సందర్శకుల ప్రవేశాన్ని నిషేధించారు. ఈ పరిణామం అమెరికా ప్రభుత్వానికి కునుకులేకుండా చేస్తోంది.
ఇప్పటికే అమెరికాలో మూడులక్షల మందికిపైగా కరోనాతో బాధపడుతున్నారు. మృతుల సంఖ్య దాదాపుగా పదివేలకుపైగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక న్యూయార్క్లో అయితే పరిస్థితి మరింత దయనీయంగా మారుతోందని. ఆస్పత్రులలో ఎటుచూసినా మృతదేహాలే కనిస్తున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లో కూడా అధికారులు అప్రమత్తం అయ్యారు. మన జూలలోని జంతువులు ఎలా ఉన్నాయి.. వాటి ప్రవర్తన ఎలా ఉంది..? సాధారణంగానే కనిపిస్తున్నాయా..? లేక మరేమైనా ప్రత్యేకమైన లక్షణాలతో ఉంటున్నాయా..? అని కేంద్ర ప్రభుత్వం అధికారయంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. జూలను హైఅలర్ట్లో ఉంచాలని ఆదేశించింది.