దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే.. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాయి. అయితే.. పలుచోట్ల కరోనా అనుమాని లక్షణాలు ఉన్నా కూడా కొందరు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. అంతేగాకుండా.. కరోనా బారిన పడినవారిలో కొందరు ఇతరులకు కూడా ఆ వ్యాధిని అంటించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇతరులపై ఉమ్మివేసి, వారికి వైరస్ సోకేలా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారి ఆటలు కట్టించేందుకు హిమాచల్ ప్రదేశ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఇందులో భాగంగా.. కరోనా పాజిటివ్ వ్యక్తులు ఇతరులపై ఉమ్మినా.. తుమ్మినా మర్డర్ కేసు నమోదు చేస్తామని హిమాచల్ ప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. బాధితుడు కరోనాతో మరణిస్తే.. ఇందుకు కారణమైన కరోనా పాజిటివ్ వ్యక్తికి మర్డర్ కేసు కింద శిక్ష విధిస్తామని రాష్ట్ర డీజీపీ తెలిపారు. ఇప్పుడు హిమాచల్ప్రదేశ్ తీసుకున్న నిర్ణయంపై ఆసక్తికరమైన చర్చజరుగుతోంది. ఆకతాయిల ఆటలు కట్టించేందుకు ఇలాంటి కఠిన నిర్ణయాలు చాలా అవసరమైని దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు స్వీయనియంత్రణ పాటిస్తున్నారు. సామాజికదూరం పాటిస్తూ తమ నిత్యావసర సరుకులను తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు కరోనా పాజిటివ్ వ్యక్తులు ఇతరులపై ఉమ్మేందుకు, తుమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో హిమాచల్ప్రదేశ్ అడుగుజాడల్లోనే మరికొన్ని రాష్ట్రాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.