కరోనా వైరస్తో ప్రపంచదేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అగ్రరాజ్యాలు సైతం అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 62వేల మందికిపైగా కరోనాతో మృతి చెందారు. ఇక లక్షలాదిమంది కరోనాతో బాధపడుతున్నాయి. అయితే.. కరోనా వైరస్ కట్టడికి దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. అయితే.. కరోనాకు మందు లేదు.. వ్యాక్సిన్ లేదు. మన చేతిలో ఉన్నది ఒక్కటే ఆయుధం.. అదేమిటంటే.. స్వీయనియంత్రణ, సామాజిక దూరం పాటించడం.. ప్రభుత్వాలు సూచిస్తున్న నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించడం. కానీ.. కొన్నిదేశాల్లో ప్రాణాలు పోతున్నా ప్రజలు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. కరోనా కట్టడికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో వైరస్ వ్యాప్తి మరింత వేగంగా జరుగుతోంది. ఈనేపథ్యంలోనే స్వీడన్ ప్రధానికి కోపం వచ్చింది. ఆ దేశ ప్రజల తీరుపై మండిపడ్డారు.
స్వీడన్లో కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించగా...వాటిని లెక్కచేయకుకండా బీచ్లు, రెస్టారెంట్లకు ప్రజలు వెళ్తుండటం పట్ల స్వీడన్ ప్రధాని స్టీఫన్ లావెన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా వేలాది మంది చావు కోసం ఎదురుచూస్తున్నారంటూ మండిపడ్డారు. మీకు మీరే మృత్యువును ఆహ్వానిస్తున్నారని ఫైర్ అయ్యారు. అయితే.. ఇప్పటికే కరోనాను కట్టడి చేసేందుకు పలు దేశాల్లో లాక్డౌన్ కొనసాగుతుండగా.. స్వీడన్లో మాత్రం పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, బీచ్లు జనాలతో కళకళలాడుతున్నాయి. అయితే.. ప్రజలు ఇలాగే వ్యవహరిస్తే ముందుముందు తీవ్ర పరిణామాలు ఉంటాయని వైద్యులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి స్వీడన్లో లాక్డౌన్ను ప్రభుత్వం ప్రకటించలేదు. కొన్ని ఆంక్షలు మాత్రం విధించింది. ఎలాంటి కార్యక్రమాల్లోనైనా 50 మందికి మించి పాల్గొనకూడదంటూ చెప్పింది. సామాజికదూరం పాటించాలని ప్రజలను అక్కడి ప్రభుత్వం కోరింది. అయితే దీన్ని మాత్రం ఎవరు లెక్క చేయడం లేదు. కాగా, స్వీడన్లో ఇప్పటి వరకు 6,830 కరోనా కేసులు నమోదుకాగా, 401 మంది మృతి చెందారు.