దేశంలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని, ఇదేసమయంలో వందలాదిమంది ప్రాణాలు ప్రమాదంలోనే ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో కొనసాగుతున్న లాక్డౌన్ ఒక్కటే మనల్ని కరోనా వైరస్ నుంచి కాపాడిందని, ఇక ముందుకూడా మరింత పకడ్బందీగా లాక్డౌన్ను పాటించి, మనల్ని మనం కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికాకు చెందిన ఓ సంస్థ సూచించిన ప్రకారం భారత్లో జూన్ వరకూ లాక్డౌన్ కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రజలు కూడా అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నా.. లాక్డౌన్కు చాలా బాగా సహకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపుగా 22దేశాలు లాక్డౌన్ పాటిస్తున్నాయని ఆయన తెలిపారు. ఒకవేళ మనం లాక్డౌన్ పాటించకుండా ఉండి ఉంటే.. పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని ఆయన అన్నారు.
దేశంలో కరోనా వైరస్ను కట్టడిచేయగలిగామని, పకడ్బందీ చర్యలతో వైరస్ను అదుపులో ఉంచగలిగామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి భారత్ తీసుకుంటున్న పద్ధతులను ప్రపంచదేశాలను మెచ్చుకుంటున్నాయని ఆయన అన్నారు. అందుకే భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్డౌన్ను కొనసాగించడం ఒక్కటే మార్గమని కేసీఆర్ చెప్పారు. ప్రధాని మోడీ అడిగినా కూడా ఇదే విషయం చెబుతానని, లాక్డౌన్ కొనసాగించాలని సూచిస్తానని అన్నారు. దేశంలో జనతా కర్ఫ్యూ తర్వాత లాక్డౌన్ పాటిస్తున్నామని, ఇవి మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అందుకే ఇతర దేశాలతో పోల్చితే భారత్ చాలా సేఫ్గా ఉందని కేసీఆర్ అన్నారు. అమెరికా లాంటి అగ్రరాజ్యమే నేడు ఆగమాగం అవుతోందని, న్యూయార్క్ లాంటి నగరాల్లోశవాల గుట్టలు కనిపిస్తున్నాయని, ఇది చాలా బాధకరమైన విషయమని ఆయన అన్నారు.