దేశం కష్టకాలంలో ఉందని, ఇలాంటి సమయంలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని, కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఐక్యతను చాటాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కవులు, కళాకారులు, బుద్ధిజీవులు బయటకు రావాలని, కరోనా బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు నడుంబిగించాలని ఆయన కోరారు. ప్రధానంగా కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కవులు మంచి సాహిత్యం వెలువర్చాలని ఆయన కోరారు. ప్రజలను నిత్యం చైతన్యపర్చాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. మనలోని సంకల్ప బలాన్ని చాటేందుకు ప్రజలందరూ దీపాలు వెలిగించాలని ప్రధాని మోడీ పిలుపునిస్తే.. కొందరు చిల్లరగాళ్లు జోకులు వేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన హెచ్చరించారు. ఇలాంటి కష్టకాలంలో ప్రజలకు ధైర్యం కల్పించాలని, కానీ ఇలాంట చిల్లర ప్రచారం చేయొద్దని ఆయన సూచించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను ఐక్యం చేసేందుకు తాను ఇలాంటి కార్యక్రమాలకు అనేకమార్లు పిలుపునిచ్చామని, ఆ కార్యక్రమాలను ప్రజల్లో సంకల్పబలాన్ని నింపుతాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తున్న వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కొందరు చిల్లరవేశాలు వేస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. అలాంటి చిల్లరగాళ్లకు త్వరలోనే బుద్ధి చెబుతామని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇలాంటి సమయంలో కవులు, కళాకారులు, బుద్ధిజీవులు బయటకు వచ్చి ప్రజల్లో ధైర్యం నింపాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక కరోనా జాగ్రత్తలపై కవులు మంచి సాహిత్యం తీసుకురావాలని, సందర్భాన్నిబట్టి ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ పిలుపుపట్ల కవులు, కళాకారులు, బుద్ధిజీవులు సానుకూలంగా స్పందిస్తున్నారు.