ప్రపంచవ్యాప్తంగా కరోనా బీభత్సం సృష్టిస్తోంది. పలుయూరప్ దేశాలతోపాటు అమెరికా చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఎటుచూసిన శవాలే. ఆస్పత్రుల నిండా బాధితులే. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 70 వేల మందిని కరోనా బలితీసుకొంది. ఇందులో యూర్పలోనే అత్యధికంగా 50,125 మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలో సోమవారం 900 మంది మరణించగా.. మొత్తం సంఖ్య 10,516కు చేరుకోవడంతో అక్కడి పౌరుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాకుండా.. కొత్తగా పాజిటివ్ కేసులే 20 వేల వరకు నమోదవడం గమనార్హం. ఇక ప్రపంచంలోనే అత్యధికంగా 15,877 మరణాలతో ఇటలీ, 13,055 మరణాలతో స్పెయిన్, 8,078 మరణాలతో ఫ్రాన్స్ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. యూర్పలో ఒక్కరోజే 1100 మంది చనిపోయారు. చివరికి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం కూడా విషమించడంతో ఐసీయూకు తరలించారు.
బ్రిటన్లో సోమవారం 439 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 5,373కు చేరింది. స్పెయిన్, ఇటలీలో 24 గంటల్లో వరుసగా 637, 636 మంది చనిపోయారు. అయితే..గత కొద్దిరోజులతో పోల్చితే మరణాల సంఖ్య తగ్గినట్టేనని చెప్పొచ్చు. ఒకదశలో ఒక్కరోజే 950 మరణాలను చూసిన స్పెయిన్లో రెండు వారాల్లో తొలిసారిగా సోమవారమే తక్కువ మరణాలు నమోదయ్యాయి. ఇక చూస్తుండగానే.. లక్ష పాజిటివ్ కేసుల జాబితాలో జర్మనీ చేరిపోయింది. అక్కడ ఇప్పటికి 1,500 మంది చనిపోయారు. దాదాపు 20 వేల మంది విదేశీయులను సింగపూర్ ప్రభుత్వంలో క్వారంటైన్ చేసింది. పాకిస్థాన్లో ఇప్పటికి 3,277 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. చైనాలో కొద్దిరోజులుగా రెండోవిడత కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికి 38 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక భారత్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు నాలుగువేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.