కరోనా వైరస్ కట్టడికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలతోపాటు అనేక సంస్థలు కృషి చేస్తున్నాయి. ప్రస్తుతానికి మందుగానీ.. వ్యాక్సిన్గానీ లేనిపరిస్థితుల్లో కేవలం దాని వ్యాప్తిని అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు కరోనా వైరస్తో సుమారు 13లక్షల మందికిపైగా బాధపడుతున్నారు. ఇక 70వేల మంది మరణించారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ కూడా కరోనా కట్టడిలో భాగస్వామ్యం కావడానికి ముందుకు వచ్చింది. కరోనా వ్యాప్తి నిరోధానికి అవసరమైన ఫేస్ షీల్డ్స్ అంటే ముఖాలకు రక్షణ కల్పించే కవచాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫేస్ షీల్డ్స్ ను డిజైన్ చేసే క్రమంలో ఆపిల్ సంస్థ తన ప్రొడక్ట్ డిజైనర్లను, ఇంజినీరింగ్ ఉద్యోగులను, ప్యాకేజింగ్ సిబ్బందిని ఒక్కచోటికి చేర్చింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లడం ప్రమాదకరమని తెలిసినా.. అవసరమైన సిబ్బందిని ఒక్కచోటకు చేర్చుతోంది. అయితే.. ‘ది క్యూపర్టినో’ అనే కాలిఫోర్నియా సంస్థ ఈ ఫేస్ షీల్డ్స్ తయారుచేస్తున్నది. వారానికి సుమారు పది లక్షల కవచాలు తయారుచేయాలని నిర్ణయించారు. వీటిని ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే వినియోగించనున్నారు. మున్ముందు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ముఖ కవచాలు కరోనా చికిత్సలో ప్రాణాలకు తెగించి పాలుపంచుకునే వైద్యసిబ్బందికి ఎంత రక్షణగా ఉపకరిస్తాయని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. సకాలంలో ఈ ముఖ రక్షణ కవచాలు అందుబాటులోకి వస్తే మాత్రం..కరోనా వైరస్ వ్యాప్తిని చాలా వరకు అడ్డుకున్నట్టేనని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి.. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మాస్క్లు కొరత ఉంది. ఇందులోనూ కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు మరిన్ని రక్షణ చర్యలు కల్పించాల్సిన అవసరం ఉంది.