ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి భయంకరంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలోనూ కరోనా నిన్నటి వరకు జోరుగా విజృంభించింది. ఇప్పటి వరకు ఏపీలో కరోనా కేసులు మొత్తం 303కు చేరుకున్నాయి. కరోనా ఇంతలా విజృంభిస్తుంటే మరో వైపు కరోనా చుట్టూ రాజకీయాలు కూడా జోరుగా ముసురు కుంటున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ విమర్శలు చేస్తోంది. కరోనా రోగులకు ఇంతలా కష్టపడి వైద్యం చేస్తున్నా డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి జగన్ సర్కార్ కనీసం మాస్కులను కూడా సరఫరా చేయలేకపోతోందని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సుధాకర్ చేసిన ఆరోపణలు తాజాగా కలకలం రేపుతున్నాయి.
ఈ ఆరోపణలను బేస్ చేసుకుని టీడీపీ నేతలు మరింతగా రెచ్చిపోతున్నారు. ఈ ఆరోపణలకు ఇప్పుడు నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కౌంటర్ ఇచ్చారు. సుధాకర్ ఆరోపణల వెనక టీడీపీ నేతల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేయడానికి ముందు ఆయన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్లొచ్చారని మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ సైతం తన వద్ద ఉందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ వీడియోను కూడా మీడియాకు రిలీజ్ చేశారు.
ఇక సుధాకర్ మాట్లాడుతూ 150 పడకల సామర్థ్యం గల నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పేషెంట్లకు వైద్యం అందించడానికి కనీస సౌకర్యాలు లేవని, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం డాక్టర్లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆ పరిస్థితి ఏపీలో లేదని అన్నారు.