కరోనా విస్తృతి ని కట్టడి చేయడం కోసం దేశ వ్యాప్తంగా ఈ నెల 14 వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుంది . అయితే కరోనా కేసులు క్రమేపి పెరుగుతోన్న నేపధ్యం లో లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు లేకపోలేదన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి . కేంద్ర ప్రభుత్వం మాత్రం లాక్ డౌన్ పొడిగించే కంటే సడలింపుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు అందుతోన్న నేపధ్యం లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి లాక్ డౌన్ ను పొడగించాల్సిందేనని సూచించారు .
కరోనా కట్టడికి లాక్ డౌన్ మినహా మరొక ప్రత్యామ్నాయం లేదంటూ కుండబద్దలు కొట్టారు . దేశంలో ప్రజారోగ్య సేవలపై ఆయన ఈ సందర్బంగా నిశితంగా విశ్లేషణ చేశారు . బోస్టన్ గ్రూప్ నివేదికను కోడ్ చేసిన కేసీఆర్ ... జూన్ వరకు లాక్ డౌన్ ప్రకటించాలని బోస్టన్ గ్రూప్ సూచించిందని వెల్లడించారు . తెలంగాణ లో తబ్లీగి జమాత్ మతసమ్మేళనానికి హాజరయి వచ్చిన వారితో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిన తరువాత కేసీఆర్ సర్కార్ ఒక్కసారిగా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది . ఏప్రిల్ 14 వతేదీన లాక్ డౌన్ ఎత్తివేస్తే కాంటాక్ట్ కేసుల సంఖ్య పెరిగే ప్రమాదముందని గ్రహించి , లాక్ డౌన్ గడువు పొడిగించడం ఒక్కటే మార్గమన్న నిర్ణయానికి వచ్చింది .
ఒక్క తెలంగాణ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో లాక్ డౌన్ పొడగింపు నిర్ణయాన్ని కేంద్రమే తీసుకుంటే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది . ఒకవేళ కేంద్రం లాక్ డౌన్ సడలించిన తెలంగాణ సర్కార్ మాత్రం లాక్ డౌన్ పొడిగించే అవకాశాలున్నాయని మీడియా సమావేశం ద్వారా కేసీఆర్ ప్రజలకు స్పష్టమైన సంకేతాలను ఇచ్చారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు .