రోజురోజుకూ తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి పెరగకుండా కేసీఆర్ ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. అలాగే ఈ కరోనా మహమ్మారి విజృంభించకుండా ఉండాలంటే లాక్ డౌన్ మరింత పొడిగించాలని కేసీఆర్., కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 

అయితే ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన ప్రతిపక్షాలు కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ అంటే ఒంటి కాలిమీద లేచే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లు కేసీఆర్ పై మండిపడుతున్నారు. తాజాగా కేసీఆర్ కరోనాపై మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తుందని, అది ఏ మాత్రం సరికాదని, ఇక అలాంటివారికి కరోనా రావాలని కొంచెం గట్టిగానే మాట్లాడారు. 

 

ఇక ఇదే విషయంపై రేవంత్ స్పందిస్తూ... సలహాలు, సూచనలు ఇస్తే వారికి కరోనా వైరస్ రావాలని, పోవాలని అంటున్నారని.. ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్‌పై కేసు పెట్టాలని మాట్లాడారు. అటు బండి సంజయ్ కూడా క్షేత్రస్థాయిలోని వాస్తవాలను తెలియజేస్తే.. అలాంటివారికి కరోనా రావాలని కేసీఆర్‌ వ్యాఖ్యానించడం సరికాదని, జరిగిన విషయాలను మీడియా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే,  వారికి  కరోనా రావాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు.

 

అయితే కేసీఆర్ చేసిన ఆ వ్యాఖ్యలకు మీడియా నుంచి గానీ, ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకిత రాలేదు. నిజంగానే తప్పుడు వార్తలని ప్రచారం చేస్తూ, తప్పుదోవ పట్టించేవారికి సరైన శిక్ష పడాలని వారు కోరుకుంటున్నారు. కానీ రేవంత్, బండి సంజయ్ లు మాత్రం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేసారు. ఈ ఇద్దరు నేతలు కేసీఆర్ సర్కార్ పై ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇక ఈ కరోనా సమయంలో మాత్రం వారికి పెద్దగా విమర్శలు చేసే అవకాశం దక్కలేదు. ఇక ఇప్పుడు కేసీఆర్ అలా మాట్లాడారని చెప్పి, మీడియా ముందుకొచ్చి విమర్శలు చేసేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: