కరోనా.. కంటికి కనిపించని శత్రువు. మానవాళి మనుగడకు అత్యంత ప్రమాదకరంగా మారుతున్న వైరస్. ఇంతటి సాంకేతిక యుగంలోనూ దాని వ్యాప్తిని అరికట్టలేకపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం ప్రాణాలు కాపాడుకోవడానికి అనేక దారులు వెతుక్కోవాల్సి వస్తోంది. ఇందులో ప్రధానంగా సామాజిక దూరం పాటించడమే మానవాళి ముందున్న ఏకైక మార్గమని ఇప్పటికే ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు పదేపదే చెబుతున్నారు. ప్రజలు స్వీయనియంత్రణ పాటించాలని, ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. అది అత్యంత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. అయినా.. కొందరు తమకేమీ కాదులే అంటూ నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఐసీఎంఆర్ నిర్వహించిన స్టడీ ఒక షాకింగ్ విషయం బయటపడింది. అదేమిటంటే.. కోవిడ్19బాధితుడు సామాజిక దూరాన్ని పాటించకున్నా.. వారి నుంచి కరోనా వైరస్ కేవలం 30 రోజుల్లో 406 మందికి సోకే ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఐసీఎంఆర్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని స్వయంగా కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. అందుకే ..ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలని ఆయన సూచించారు. కరోనా కట్టడికి అదొక్కటే మనదగ్గర ఉన్న ఏకైక ఆయుధమని ప్రభుత్వాలు చెబుతున్నాయి. లాక్డౌన్ నిబంధనలుపాటించాలని సూచిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చెబుతన్నారు. ఇక భారత్లో మంగళవారం రాత్రి వరకు 4789 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 124మంది మరణించారు. 353మంది కోలుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు లక్షా ఏడు వేలమందికిపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ ఎపిడమాలజీ అధిపతి గంగాఖేద్కర్ తెలిపారు. 136 ప్రభుత్వ ల్యాబ్లు పరీక్షలు చేపడుతున్నాయని, 59 ప్రైవేటు ల్యాబ్లు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 81200మంది మరణించారు. 14లక్షల మందికిపైగా కరోనా వైరస్ సోకింది. సుమారు మూడు లక్షల మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు.