తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ క్రమంగా అదుపులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న పటిష్టమైన చర్యలతో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోందనే టాక్ వైద్యవర్గాల్లో వినిపిస్తోంది. తబ్లిఘి జమాత్ ఉదంతం వల్లే కొంత కలవరం ఏర్పడినా.. పెద్దగా భయపడాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారందరినీ గుర్తించి, వారికి పరీక్షలు చేపట్టి, వైద్యసేవలు అందిస్తున్నారు. అయితే.. ఇదే సమయంలో ప్రజలు మాత్రం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సామాజిక దూరం పాటించాలని, లాక్డౌన్ నిబంధనలను గౌరవించాలని అంటున్నారు. గతంలో పోల్చితే ఏపీలో కొంతమేరకు కరోనా ప్రభావం తగ్గినట్లు కనిపిస్తోంది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 314కు చేరుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కేవలం 11 కేసులు నమోదయినట్లు వెల్లడించింది. గుంటూరు 9, కడప, నెల్లూరులో ఒక్కో కేసు నమోదయ్యాయి. గతంతో పోల్చితే కేసల సంఖ్య తగ్గడం గమనార్హం.
ఇక తెలంగాణలో మంగళవారం 40 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు 404 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా నుంచి 45 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 348 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 11 మంది కరోనాతో చనిపోయారు. హైదరాబాద్లో అత్యధికంగా 150 కేసులు నమోదు కాగా, నిజామాబాద్లో 36, వరంగల్ అర్బన్లో 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే.. హైదరాబాద్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడం మాత్రం కొంత ఆందోళన కలిగిస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెడుతున్నారు. ఇదిలా ఉండగా.. మరికొన్ని రోజులు లాక్డౌన్ కొనసాగించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీ సూచించారు. ఇక లాక్డౌన్ విషయంలో ఏపీ సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.