హైడ్రాక్సీక్లోరోక్విన్.. ఇప్పుడు అనేక దేశాలు ఈ మందు కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ మందును తమకూ పంపించాలని భారత్ను వేడుకుంటున్నాయి. కరోనా మహమ్మారికి తాత్కాలిక మందుగా దీనిని వినియోగించడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే.. అసలు కరోనా వైరస్ చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ను ఉపయోగించాలని ముందుగా ఎవరు చెప్పారో తెలుసా..? ఆయన ఫ్రెంచ్ డాక్టర్ దిదయర్ రౌల్ట్. కరోనా చికిత్సకు ఈ మందు పనిచేస్తుందని చెప్పడం, పలు దేశాలు దానిని ప్రయోగించడం, అందుకు తగ్గట్టే కొంతమేరకు సత్ఫలితాలు రావడంతో ఒక్కసారిగా ఈ మందుకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇటీవల ఈ మందు కోసం భారత్ను దాదాపుగా 30దేశాలు వేడుకుంటున్నాయి. తమకు దయజేసి ఈ మందును తమకూ ఇవ్వాలని కోరుతున్నాయి. ఇక ఆ డాక్టర్ గురించి తెలుసుకుందాం..
దిదయర్ రౌల్ట్ది ఫ్రాన్స్లోని మారిసెల్లి. రౌల్ట్ ఓ బయోలజిస్ట్. మైక్రోబయాలజీ ప్రొఫెసర్ కూడా. ప్రస్తుతం మారిసెల్లిలోని మెడిటరేనియన్ ఇన్ఫెక్షన్ ఇన్స్టిట్యూట్ డైరక్టర్గా కొనసాగున్నారు. యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్వీన్తో కరోనా బాధితులకు చికిత్స చేయొచ్చునని రౌల్ట్ అధ్యయనం చేసి వెల్లడించడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కేవలం 40 మంది పేషెంట్లపై మాత్రమే తాను స్టడీ చేసినట్లు డాక్టర్ రౌల్ట్ తెలిపారు. అయితే దాంట్లో సగం కన్నా ఎక్కువ మంది కేవలం మూడు నుంచి ఆరు రోజుల్లో తమ శ్వాసకోస రుగ్మతల నుంచి బయటపడినట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఆయన మార్చి ప్రారంభంలోనే చెప్పారు. వెంటనే అప్రమత్తమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మందు గురించి పదేపదే మాట్లాడడంతో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. హైడ్రాక్సీక్లోరోక్వీన్తో కోవిడ్ వ్యాధి నయం అవుతుందని మార్చి 22వ తేదీన డాక్టర్ రౌల్ట్ బృందం మారిసెల్లిలో ప్రకటించిన వెంటనే ట్రంప్ స్పందించారు. ఈ మందు గేమ్ చేంజర్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏకంగా భారత్ను బెదిరించి మరీ ఈ మందును తెప్పించుకోవడం గమనార్హం.