చంద్రబాబు సంగతి అందరికీ తెలిసిందే. ఆయన రాజకీయం బాగుంటే వేరేగా కధ ఉంటుంది. బాగులేకపోతే మరోలా సాగుతుంది. రెండేళ్ళ క్రితం చంద్రబాబు ఏపీ సీఎం, నాడు ప్రధాని హోదాలో మోడీ ఏపీకి వస్తే గో బ్యాక్ మోడీ అన్నది ఇదే చంద్రబాబు, నల్ల కుండలతో స్వాగతం పలికి మరీ చేయాల్సిన అరాచకమంతా తమ్ముళ్ళు ఆనాడు చేశారు.
ఇక మోడీ వ్యక్తిగత విషయాల్లోకి కూడా చంద్రబాబు వెళ్ళి మరీ దూషణల పర్వం కొనసాగించారు. ఆ కధ పక్కన పెడితే ఓడిపోయాక మోడీ వాల్యూ బాబుకు తెలిసింది. ఇక్కడ 23 మంది ఎమ్మెల్యేలతో ఘోరమైన అవమానం జరుగుతోంది. మరో వైపు మోడీకి ప్రేమ లేఖలు రాసుకుంటూ కరుణించుమా అని బాబు చేస్తున్న రాజకీయ గిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు.
ఇవన్నీ పక్కన పెడితే అసలు మోడీ టీడీపీనే ఖాతరు చేయడంలేదన్నది తాజాగా మళ్ళీ రుజువు అయింది. దేశంలో కరోనా వైరస్ తీవ్రత గురించి. అలాగే లాక్ డౌన్ విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి మోడీ పార్లమెంట్ లో వివిధ పార్టీల నాయకులతో అఖిల పక్షం భేటీ ఈ రోజు నిర్వహించారు. ఈ భేటీకి టీడీపీకి అసలు ఆహ్వానమే రాలేదు. నిజంగా ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ బాబుకు ఇది ఘోర అవమానమే.
ఈ మీటింగులో పాల్గోనే పార్టీల విషయంలో కొన్ని నిబంధనలు పెట్టారు. కనీసం ఉభయ సభల్లో ఏదో సభలో అయిదుగురు ఎంపీలు అయినా ఉంటేనే వారికి ఆహ్వానం పంపాలని నిర్ణయించారు. టీడీపీకి లోక్ సభలో ముగ్గురు ఎంపీలు ఉంటే, రాజ్యసభలో కేవలం కనకమేడల రవీంద్రకుమార్ ఒక్కరే ఉన్నారు. దాంతో నలుగురు ఎంపీలతో లింగు లిటుక్కుమనే టీడీపీకి ఆహ్వానం లేకుండా పోయింది.
ఓ విధంగా కేంద్రం పెట్టిన ఈ నిబంధనతో మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లో పాలుపంచుకునే చాన్స్ టీడీపీకి లేకుండా పోయింది. అతి తక్కువ మంది ఎంపీలు గెలిచిన పాపానికి మోడీ ముందు మాట్లాడే అర్హత కూడా పచ్చ పార్టీ కోల్పోయిందన్న మాట. మోడీ పని తీరు బాగుంది. ఆయన కరోనా పై చేస్తున్నఫైట్ బాగుంది అని తమ ఎంపీల ద్వారా నాలుగు తీపి మాటలు చెప్పించాలనుకున్నా బాబుకు ఎటూ కుదిరింది కాదు. మొత్తానికి నలభయ్యేళ్ళ టీడీపీ చరిత్రలో ఇటు అసెంబ్లీలో, అటు పార్లమెంట్ లో ఇటు జనంలో కూడా పరువు పోయిన పార్టీగా టీడీపీ మిగిలిపోయిందన్న మాట. నిజంగా ఇది బాధాకరమే.