దేశ వ్యాప్తంగా కరోనా కట్టడికి విపక్షాలతో ప్రధాని నరేంద్ర మోదీ పలు దఫాలుగా సమాలోచనలు చేస్తున్నారు . ఇటీవల వివిధ రాజకీయ పక్షాల అధినేతలు , ముఖ్య నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని , బుధవారం విపక్ష పార్టీలకు చెందిన లోక్ సభ , రాజ్యసభ పక్ష నేతలతోను కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను వివరించారు . వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు . ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాలకతీతంగా హుందాగా వ్యవహరిస్తూ , విపక్షాలను కలుపుకుపోతూ ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ పరిస్థితులే కన్పించడం లేదు .
కరోనా విస్తృతిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు దన్నుగా నిలువాల్సిన విపక్షాలు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి . ఇక ప్రభుత్వ పెద్దలేమో విపక్షాలతో సమాలోచనలు చేయాల్సిన అగత్యం తమకేమి లేదన్నట్లు మొండి వైఖరి అవలంబిస్తున్నారు . కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితుల్లో రాష్ట్రం లో ప్రజల్ని ఎలా ఆదుకోవాలన్న దానిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి విపక్షాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని ముందుకువెళితే బాగుండేదన్న వాదనలు సర్వత్రా విన్పిస్తున్నాయి . కానీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయం లో అనవసర పట్టుదలకు పోయినట్లు కనిపిస్తోంది . విపక్షాల సలహాలు , సూచనలు తమకేమి అవసరం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు .
కరోనా వైరస్ విస్తృతి అన్నది ఒక విపత్కర పరిస్థితి అని , ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల్ని రక్షించుకోవడాని రాజకీయాలకతీతంగా నాయకులంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉండగా , దురదృష్టవశాత్తు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత తరుణం లో అటు పాలకపక్షాలు , ఇటు ప్రతిపక్షాలు రాజకీయాలకే అధిక ప్రాధాన్యతను ఇవ్వడం విమర్శలకు దారి తీస్తోంది .