దేశంలో అన్నీ పార్టీలు రాజకీయాలని పక్కనబెట్టి కరోనాపై యుద్ధం చేస్తున్నాయి. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం కరోనాపై ప్రజలని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే, లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు. మరోవైపు విపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ కూడా మోదీ ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తూ, పలు సలహాలు ఇస్తుంది. అలాగే కరోనా ప్రభావం ఇంకా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రధాని లాక్ డౌన్ పొడిగించిన మద్ధతు ఇస్తామని చెబుతుంది.

 

అయితే ఎప్పుడు మోదీపై విమర్శలు చేసే కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఇప్పుడు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. తాజాగా మోదీతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, ప్రభుత్వానికి మద్ధతుగా నిలుస్తామని ప్రకటించారు. అలాగే లాక్ డౌన్ పొడిగింపు ముమ్మాటికి సమర్థనీయమేనని మరో సీనియర్ నేత చిదంబరం అన్నారు.

 

అలాగే మోదీ అంటే విరుచుకుపడే కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి ఊహించని మద్ధతు పలికారు. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, కరోనా కట్టడికి ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్‌ను భారత ప్రభుత్వం తమకు ఇవ్వకపోతే తీవ్ర పరిస్థితులు ఎదురుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

 

అయితే ఈ వార్నింగ్‌తో సంబంధం లేకుండా భారత ప్రభుత్వం అమెరికాతో పాటు పలు దేశాలకు క్లోరోక్విన్ డ్రగ్‌ని పంపించారు. ఇక ఇదే విషయంపై శశిథరూర్ స్పందిస్తూ.... మీరు కోరిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్‌ను ఎలాంటి స్వార్థం లేకుండా మీకు అందించేందుకు భారత్ అంగీకరించిందని, అమెరికా ప్రయోగశాలల్లో కరోనాకు ఏదైనా వ్యాక్సిన్‌ను కనుక్కుంటే, దాన్ని అందరి కంటే ముందు భారత్‌కు ఇచ్చేందుకు అనుమతిస్తారా? అని ట్రంప్‌ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

 

ఇక శశిథరూర్ పరోక్షంగా మోదీ ప్రభుత్వానికి స్వార్థం లేదని చెప్పారు. ఏదేమైనా ఇలాంటి క్లిష్ట సమయంలో అందరూ ఒకేతాటిపైకి వచ్చి, కరోనాపై పోరాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: