కరోనా వైరస్ ప్రభావితం చేయని రంగమంటూ ఏదీ లేదు. ప్రస్తుతం ఈ వైరస్ వల్ల మనుషులు ప్రత్యక్షంగా ప్రభావితం అవుతుంటే...ఆర్థిక వ్యవస్థలు, ఇతరత్రా అంశాలు సైతం అదే రీతిలో కుదుపులకు లోనవుతున్నాయి. ఈ పరంపరలో తాజాగా హైదరాబాద్ వాసులకు ఓ బ్యాడ్ న్యూస్ తెరమీదకు వచ్చింది. ఏటా ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో పూర్తి ఆస్తిపన్ను చెల్లించేవారికి ఎర్లీబర్డ్ ఆఫర్ పేరుతో ఐదు శాతం రాయితీ కల్పించేవారు. అయితే ఈసారి కరోనా ప్రభావంతో పన్ను చెల్లింపు గడువును జూన్ చివరి వరకూ పొడిగించడంతో ఎర్లీబర్డ్ ఆఫర్కు ఆస్కారం లేకుండా పోయింది.
ప్రతిఏటా మార్చిలో ఆర్థిక సంవత్సరం పూర్తయ్యాక సాంకేతిక ప్రక్రియలో భాగంగా ఐదు రోజులపాటు ఆన్లైన్ చెల్లింపులు నిలిపివేస్తారు. అయితే ఈ ఏడాది వారం రోజులపాటు నిలిపివేసి బుధవారం నుంచి ప్రారంభించారు. 2020-21ఆర్థిక సంవత్సరానికి ఆన్లైన్ ద్వారా ఆస్తిపన్ను చెల్లింపులు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 3900 మంది సుమారు రూ. రెండుకోట్ల మేర పన్ను చెల్లించారు. గడిచిన 2019-20 ఆర్థిక సంవత్సరానికి కూడా వచ్చే జూన్ వరకు ప్రభుత్వం గడువు పొడిగించడంతో అప్పటివరకు అపరాధ రుసుం లేకుండా పన్ను చెల్లించే అవకాశం ఉంది. ఎల్బీనగర్, హయత్నగర్, సరూర్నగర్ సర్కిళ్లలో ఆస్తిపన్ను ఎక్కువ ఉండడంతో ప్రభుత్వం ఈ సర్కిళ్ల పరిధిలో నివాస భవనాలకు 7.5శాతం, వాణిజ్య భవనాలకు 15శాతం మేర పన్నులో రాయితీ కల్పించింది.
ఇదిలాఉండగా, విధి నిర్వాహణలో ఉన్న ఓ కానిస్టేబుల్పై ఇనుప రాడ్తో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటనలో కీలక అరెస్టులు జరిగాయి. చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించే కానిస్టేబుల్ పి.ప్రవీణ్ కుమార్ (34),ఈ నెల 4వ తేదీన హాఫిజ్బాబానగర్ సమీపంలోని ఉన్న కస్టమర్ సర్వీస్ పాయింట్లో పలు రకాల సేవల వినియోగం కోసం వచ్చిన కస్టమర్లు క్యూ లైన్లో సేవలను పొందేలా సూచనలు చేస్తుండగా ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఇనుపరాడ్తో తలపై కొట్టి పారిపోయారు.
తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ కుమార్ను డీఆర్డీఎల్ అపోలో వైద్యశాలలో చేర్పించి వైద్య చేయించారు. అయితే దాడికి పాల్పడి పారిపోయిన నిందితులను సీసీ కెమెరా పూటేజీ ద్వారా ఫీజ్బాబానగర్ అలియా గార్డెన్ సమీపంలో నివసించే షేక్ మహముద్ అమీరుద్దీన్ అలియాస్ అబ్బూ (21), మెకానిక్.గుల్షాన్ ఏక్బాల్ కాలనీకి చెందిన షేక్ సైఫ్ మోహినుద్దీన్ (24), ఎలక్ట్రీషీయన్లు కానిస్టేబుల్పై దాడి చేసినట్లుగా గుర్తించి అరెస్టు చేశారు.